నవతెలంగాణ-హైదరాబాద్: టారిఫ్లపై ట్రంప్ యంత్రాంగం బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సమాఖ్య చట్టం ప్రకారం అధ్యక్షుడికి విస్తృత దిగుమతి సుంకాలు విధించే అధికారం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై త్వరగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టులో వేసిన అప్పీళ్లలో ఇది తాజాది. ట్రంప్ వాణిజ్య విధానంలో ముఖ్యమైన అంశాన్ని జడ్జీల ముందు ఉంచనుంది.
ట్రంప్ విధించిన టారిఫ్ల్లో అధికభాగం అత్యవసర అధికారాల చట్టాన్ని ఉల్లంఘించి విధించినవని ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసేందుకు వీలుగా ఈ తీర్పు అమలును అక్టోబర్ 14 వరకు కోర్టు నిలిపివేసింది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న టారిఫ్లు యథావిధిగా అమలులో ఉంటాయని తెలిపింది.
ఈ తీర్పుపై బుధవారం రాత్రి ట్రంప్ యంత్రాంగం డిజిటల్గా దాఖలు చేసిన పిటిషన్పై త్వరగా జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరడంతో పాటు మీడియాకు అందించింది. నవంబర్ ప్రారంభంలో కేసుపై వాదనలు చేపట్టాలని సొలిసిటర్ జనరల్ డి.జాన్సౌర్ కోర్టును కోరారు.
” ఈ తీర్పుతో గత ఐదు నెలలుగా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ద్వారా కొనసాగిస్తున్న విదేశీ చర్చలపై అనిశ్చితి నెలకొంటుంది. ఇప్పటికే చర్చలు ఫలవంతమై కుదిరిన ఒప్పందాలు, కొనసాగుతున్న చర్చలు రెండింటినీ ప్రమాదంలో పడేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఈ చట్టవిర్ధుమైన టారిఫ్లతో చిన్న వ్యాపారాలకు కూడా ప్రమాదం అధికంగా ఉందని లిబర్టీ జస్టిస్ సెంటర్ సీనియర్ న్యాయవాది, వ్యాజ్యం దాఖలు చేసిన జెఫ్రీ ష్వాబ్ పేర్కొన్నారు. ఈ టారిఫ్లు చిన్న వ్యాపారాలకు తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని, వాటి మనుగడను ప్రమాదంలో పడేస్తున్నాయని అన్నారు. తమ క్లయింట్ల కోసం ఈ కేసుకు సత్వపరిష్కారం లభిస్తుందని తాము ఆశిస్తున్నామని అన్నారు.