– అల్యూమినియంపైనా రెట్టింపు సుంకాలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చెప్పినంత పని చేస్తున్నారు. తన వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ బుధవారం సంతకాలు చేశారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. బ్రిటన్తో వాణిజ్య ఒప్పందం అమలులో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి మాత్రం 25 శాతం సుంకాలు వర్తిస్తాయని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. స్వదేశీ స్టీల్ పరిశమ్రను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు గత వారం ట్రంప్ ప్రకటించారు. తమ ప్రభుత్వం నిర్ణయం వల్ల స్థానిక స్టీల్ పరిశ్రమకు మద్దతు లభించనుందన్నారు. అమెరికా స్టీల్ పరిశ్రమ అభివృద్ధి కోసం 14 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. జపాన్కు చెందిన నిప్పాన్ స్టీల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. స్టీల్ పరిశ్రమలో ఇక నుంచి ఉద్యోగులు తీసివేత ఉండదని, ఔట్ సోర్సింగ్ ఉండదన్నారు. ప్రస్తుతం అమెరికాకు ఏడాదికి 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.40వేల కోట్ల పైగా) విలువ చేసే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. అమెరికా చర్యలు భారత ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల లాభదాయకతను దెబ్బతీస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జిటిఆర్ఐ) వ్యవస్థాపకుడు అజరు శ్రీవాస్తవ ఇంతక్రితం ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్, ఆల్యూమినియంపై ట్రంప్ ప్రతిపాదిత 50 శాతం సుంకాలు ఈ రంగాన్ని దెబ్బతీయనున్నాయని ఇంజనీరింగ్ ఎక్స్ఫోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఇఇపిసి) తెలిపింది. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, స్టీల్పై ఉన్న 25 శాతం సుంకాన్ని అమెరికా మినహాయించిన విషయాన్ని ఇవిపిసి అధ్యక్షుడు చద్దా గుర్తు చేశారు. భారత్ కూడా ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇలాంటి సానుకూల మినహాయింపును కోరాలని సూచించారు.
స్టీల్ 50 శాతం టారిఫ్లపై ట్రంప్ సంతకం
- Advertisement -
- Advertisement -