వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎక్కడ ఉంటావో ప్రజలకూ సందేహమే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో దమ్ముంటే నీ సత్తా చూపించు : కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫైర్
పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్
మూడుసార్లు పాలేరు వచ్చి మీ నాన్నే నన్ను ఓడించలేకపోయాడు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
‘ట్విట్టర్ టిల్లు.. ముందు నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకో.. మూడున్నరేండ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావా.. ఇండియాలో ఉంటావా అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు సందేహమే’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గెలుపుపై మంత్రి పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు. పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి స్పందించారు. ఈ మేరకు గురువారం ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురం మున్సిపాల్టీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డులో జరిగిన పార్టీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
‘మీ నాయనే (కేసీఆర్) మూడుసార్లు పాలేరుకు వచ్చి ముక్కు నేలకేసి రాసినా నన్ను ఓడించలేకపోయాడు.. నువ్వెంత బచ్చాగాడివి..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా మీద నువ్వు నిలబడతావా? నా మీద నిలబడడం కాదు.. నీ మీద బచ్చగాన్ని పెట్టి గెలిపిస్తా’నంటూ కేటీఆర్పై విమర్శలు చేశారు. అయ్యా, కొడుకుల అహంకారపు మాటల వల్లే ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని అన్నారు. మూడున్నరేండ్ల తర్వాత జరిగే ఎన్నికలనాటికి నువ్వు నిజంగానే ఇండియాలో ఉంటావో, బ్యాగూ, సంచీ సర్దుకొని విదేశాలకు చెక్కేస్తావో నిర్ణయించడానికి తెలంగాణా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండంటూ సవాల్ విసిరారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, రాష్ట్ర నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, బొర్రా రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ హరినాథ్ బాబు, పార్టీ మండల అధ్యక్షులు కళ్ళెం వెంకట్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.