-‘మార్పు’ను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ : తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే రెండేండ్లలో రెండు లక్షల మంది యువతను ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని టీ హబ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత ”తెలంగాణ డేటా ఎక్స్చేంజ్” (టీజీడెక్స్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదనీ, మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి అని అభిప్రాయపడ్డారు. ఈ రంగం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త అవకాశాలు సృష్టించిందని చెప్పారు. మార్పును అందిపుచ్చుకుని తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు.
దేశంలో తొలి ఏఐ డేటా ఎక్స్చేంజ్
”ఏఐని ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకునేలా అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇది దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ డేటా ఎక్స్చేంజ్. ఇది కేవలం డేటా ప్లాట్ఫామ్ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యాత్మకమైన టెక్ పౌరసత్వానికి బలమైన పునాది. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువత అంతా ఒకే వేదికపైకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు దారి చూపుతుంది. ఇప్పటికే 480కి పైగా డేటాసెట్స్, 3వేలకు పైగా ఏఐ స్టార్టప్స్ ఇందులో భాగస్వామ్యమయ్యాయి” అని శ్రీధర్బాబు తెలిపారు.
ఐదేండ్లలో 2వేల డేటా సెంటర్లు..
”టీజీ డెక్లో రాబోయే ఐదేండ్లలో 2వేల డేటా సెంట్లర్లను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పాలనలో ఏఐ వినియోగానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తున్నాం. త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పాఠశాల స్థాయి నుంచే నిపుణులను తయారు చేసేలా ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులమ్ను రూపొందించాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజరు కుమార్, ఐటీ సలహాదారు సాయి కృష్ణ, టీ హబ్ సీఈవో కవికృత్, టీ వర్క్ సీఈవో జోగిందర్, జైకా ప్రతినిధులు టాకూచీ ఠాకూరో, యుషి నగానో తదితరులు పాల్గొన్నారు.