– 100 గ్రాముల గంజాయి, టూ వీలర్ స్వాధీనం
– కేసు నమోదు చేసి రిమాండుకు తరలింపు
నవతెలంగాణ-సత్తుపల్లి
గంజాయిని పీల్చుతున్న ఇద్దరు యువకులను సత్తుపల్లి పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. వారినుంచి 100 గ్రాముల గంజాయితో పాటు మోటార్ సైకిలును స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం… సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కువ్వారపు సతీష్ కుమార్, గత నాలుగేళ్లుగా తాగుడుకు బానిసై, గంజాయిని పీల్చడానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో గతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్దనుంచి గంజాయిని చిన్న ప్యాకెట్లుగా కొనుగోలు చేసి గంజాయిని పీల్చడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో గంజాయి ఎక్కడ దొరుకుతుందని ఆరా తీశాడు. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయిని విక్రయిస్తారని తెలుసుకొని
ఈనెల 25వ తేదీ రాత్రి సతీష్ కుమార్ 17 ఏళ్ల మైనర్ బాలుడిని వెంట తీసుకుని ఇద్దరూ కలిసి ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన ఆవులపాకకు వెళ్లారు. అక్కడ గంజాయిని విక్రయిస్తున్న భగవాన్ అనే వ్యక్తి వద్ద నుంచి అరకిలో గంజాయిని కొనుగోలు చేసి సత్తుపల్లి చేరుకున్నారు. కొనుగోలు చేసి తీసుకొచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి పలువురికి విక్రయిస్తూ వారూ పీల్చుతున్నారు. ఇదే క్రమంలో గురువారం సత్తుపల్లి పట్టణం వేంసూరు రోడ్డు శ్రీమెట్టాంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న వైకుంఠథామం వద్ద గంజాయిని పీల్చి, మిగిలిన గంజాయిని అమ్మే ప్రయత్నంలో ఉన్నారు. వాహన తనిఖీ కార్యక్రమంలో భాగంగా అటుగా వెళ్లిన పోలీసులకు కంటపడ్డారు. దీంతో పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 100 గ్రాముల గంజాయి, మోటార్ సైకిలును స్వాధీన పరుచుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోఫిక్ సబ్ స్టెన్సెస్ – 1985 (ఎన్డీపీఎస్) చట్ట ప్రకారం యువకుడు సురేష్ కుమార్ తో పాటు మైనర్ బాలుడిపై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచి ఇరువురిని రిమాండ్ నిమిత్తం సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి నిరోధక చట్టంలో భాగంగా గంజాయిని ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా, గంజాయిని పీల్చినా పైన తెలిపిన చట్ట ప్రకారం పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ శ్రీహరి హెచ్చరించారు. గంజాయికి సంబంధించి కొనుగోలు చేయడం, అమ్మడం, పీల్చడం తదితర సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని సీఐ శ్రీహరి స్పష్టం చేశారు.


