చెరువులో దూకి తండ్రీకుమార్తె ఆత్మహత్య
నవతెలంగాణ-పేట్ బషీరాబాద్
పని దొరక్క.. కుటుంబం గడవక.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ తండ్రి ఐదేండ్ల కుమార్తెను చెరువులోకి తోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలో జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్(50)- సోనీ దంపతులు. వారికి కూతురు దివ్య(5) ఉంది. మూడేండ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనీ ఎడమ కాలు తొలగించడంతో ఆమె ఇంటికే పరిమితమైంది. వంట పని చేసే అశోక్ కొంత కాలంగా పని దొరక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లో గ్యాస్ను లీక్ చేసి నిప్పంటించబోతుండగా భార్య కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. మరుసటి రోజు అశోక్ కుమార్తెను తీసుకుని బయటకు వచ్చి.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ కాలేజీ వెనుక ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం మృతదేహాలకు పైకి తేలడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.