ఇజ్రాయిల్ దాడుల్లో 58 మంది పాలస్తీనియన్లు మృతి
గాజా: గాజాలో ఇజ్రాయిల్ దాడులకు తెగబడుతూనే ఉన్నది. ప్రపంచదేశాలన్నీ ముక్తకంఠంతో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఆగడాలను ఆపాలని డిమాండ్ చేస్తున్నా.. వెనక్కి తగ్గటంలేదు. ట్రంప్ అండతోనే ఇజ్రాయిల్ రెచ్చిపోతోందని అరబ్బుదేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం 58 మందికి పైగా పాలస్తీయన్లు మరణించగా, భారీ సంఖ్యలో గాయపడ్డారు. 2023 అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయిల్ జరిపిన యుద్ధంలో కనీసం 65,549 మంది మరణించారు. 167,518 మంది గాయపడ్డారు. వేలాది మంది శిథిలాల కింద సమాధి అయ్యారని భావిస్తున్నారు. అక్టోబర్ 7, 2023న జరిగిన దాడులలో ఇజ్రాయిల్లో మొత్తం 1,139 మంది మరణించారు. దాదాపు 200 మంది బందీలుగా ఉన్నారు. మరోవైపు గాజాను స్వాధీనం చేసుకోవటానికి నెతన్యాహు యుద్ధవిమానాలు దూసుకెళ్తుడటంతో.. పాలస్తీనియన్లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులుదీస్తున్నారు. గమ్యంలేని తమకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. తమ కండ్లముందే చిన్నారులు, పెద్దలనే తేడాలేకుండా మారణకాండలో బలవుతున్న తీరు అతి భయంకరంగా ఉంటుందని మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు.