నవతెలంగాణ-హైదరాబాద్ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్య ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. ఈ పరిణామం అంతర్జాతీయ చట్టాలను గౌరవించకపోవడమేనని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
శనివారం తెల్లవారుజామున అమెరికాకు చెందిన డెల్టా దళాలు వెనిజులాలోని ఒక సైనిక స్థావరంపై దాడి చేశాయి. ఈ ఆపరేషన్లో అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఒక యుద్ధనౌకలో న్యూయార్క్కు తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. మదురోపై న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో నార్కో-టెర్రరిజం ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటనపై యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అంతర్జాతీయ చట్టాలను, యూఎన్ చార్టర్ను అందరూ తప్పక గౌరవించాలి. కానీ ఇక్కడ ఆ నియమాలను ఉల్లంఘించడంపై సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ చర్య ఆ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది” అని పేర్కొన్నారు. మానవ హక్కులు, చట్టబద్ధ పాలనను గౌరవిస్తూ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని గుటెర్రస్ పిలుపునిచ్చినట్లు తెలిపారు.
మరోవైపు, మదురో అరెస్ట్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. “వారిని ఒక నౌకలో న్యూయార్క్కు తరలిస్తున్నాం. హెలికాప్టర్లో మంచి ప్రయాణం చేశారని అనుకుంటున్నా” అని ఫాక్స్ న్యూస్తో వ్యాఖ్యానించారు. మదురో డ్రగ్స్ వ్యాపారంలో పాలుపంచుకుంటున్నారని ట్రంప్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.



