నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ల వివాదంపై ప్రధాని మోడీ మౌనం ప్రపంచంలో భారత్ ఖ్యాతిని దిగజారుస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ప్రపంచక్రమాన్ని నిర్వచించడానికి ఒక మార్గంగా దేశాధినేత హత్యకు మద్దతు ఇస్తున్నారా లేదా అనే దానిపై ప్రధాని మోడీ మాట్లాడాలని, సమాధానం చెప్పాలని అన్నారు. ఇరాన్పై ఏకపక్ష దాడులతో పాటు, ఇతర మధ్యప్రాచ్య దేశాలపపై ఇరాన్ దాడులను ఖండించాలని ఆయన అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేసిన సంగతి తెలిసిందే.
అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు సున్నితమైన ప్రాంతాన్ని తీవ్ర సంఘర్షణ వైపు నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు కోటిమంది భారతీయులతో సహా కోట్లాది మంది ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ”భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఇరాన్పై ఏకపక్ష దాడులు, అలాగే ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలి. ఘర్షణలు మరింత ఘర్షణలకు దారితీస్తాయి. చర్చలు మరియు సంయమనం శాంతికి ఏకైక మార్గం” అని అన్నారు.
‘‘భారతదేశం నైతికంగా స్పష్టంగా ఉండాలి. అంతర్జాతీయ చట్టం మరియు మానవుల ప్రాణాలను కాపాడుకోవడంలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలి. మన విదేశాంగ విధానం సార్వభౌమాధికారం మరియు వివాదాల శాంతియుత పరిష్కారాన్ని సూచిస్తుంది. అది స్థిరంగా ఉండాలి” అని అన్నారు. మధ్యప్రాచ్యం సంఘర్షణపై ప్రధాని మోడీ మాట్లాడాలని పునరుద్ఘాటించారు. ప్రపంచ క్రమాన్ని నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేత హత్యను సమర్థిస్తారా అని ప్రధాని మోడీని నిలదీశారు.



