నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలాన్ని గుర్తుకు తెస్తూ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చూపుతూ, 19 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడంపై కొత్తగా కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ బుధవారం ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడంపై పూర్తి నిషేధం అమల్లోకి రానుండగా, మరో 7 దేశాల వారికి పాక్షిక పరిమితులు వర్తిస్తాయి.
పూర్తిస్థాయి ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. అలాగే బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనిజులా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను ఎదుర్కోనున్నారు.
2025 జనవరి 20న ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు 14161 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. తీవ్రవాదం, జాతీయ భద్రతతో సహా వివిధ దేశాల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై సమగ్రమైన అంచనా వేసిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సందర్శకులు, వీసా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అసాధ్యంగా ఉన్న దేశాలను గుర్తించాలని, అలాంటి దేశాలు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఆ కార్యనిర్వాహక ఉత్తర్వు సంబంధిత ఏజెన్సీలను ఆదేశించింది.