ప్రముఖ దర్శకుడు, నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
విలక్షణ నటుడిగా, అభిరుచిగల దర్శకుడిగా పేరొందిన అస్రాని జైపూర్లో (1941) జన్మించారు. ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్గా పని చేస్తూ, ఆ జీతంతో డిగ్రీ పూర్తి చేశారు.
నటనపై ఆసక్తితో 1962లో ముంబయి చేరుకున్నారు. అనుకోకుండా కలిసిన దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. 1966లో వచ్చిన ‘హమ్ కహా జా రహే హై’తో తొలిసారి వెండితెరపై కనిపించారు. ఆ తరువాత సంవత్సరం విడుదలైన ‘హర్ కాంచ్ కీ చూడియా’ విశేష ప్రేక్షకాదరణతో సాధించిన ఘన విజయంతో అస్రానికి మంచి గుర్తింపు లభించింది. ఇక ‘షోలే’లోని జైలర్ క్యారెక్టర్ అయన్ని నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్ళింది.
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ‘హీరో హిందుస్థానీ’, ‘డ్రీమ్గర్ల్ 2’ వంటి వాటితో సహా దాదాపు 350కి పైగా హిందీ, గుజరాతీ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి, ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే ‘చలా మురారీ హీరో బన్నే’, ‘ఉడాన్’, దిల్ హై తో హై’, ‘సలామ్ మేమ్సాబ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, అభిరుచిగల దర్శకుడిగానూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల మనసులపై తనదైన ముద్ర వేసిన అస్రాని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
విలక్షణ నటుడు అస్రాని కన్నుమూత
- Advertisement -
- Advertisement -