నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై రోజురోజుకు కాంగ్రెస్ విమర్శలు తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులంతా ఈసీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్రాల ఎన్నికల నిర్మాణం, ఓటరు సరళిని మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని.. ఇది అధికార దుర్వినియోగంగా ఆరోపించారు. దీన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా వ్యతిరేకించాలన్నారు. బిహార్లో 65లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కునే కోల్పోయే ప్రమాదం ఉందని.. తమిళనాడులో 6.5లక్షల మంది ఓటర్లు పెరగడం ఆందోళనరమైన చర్యని, చట్టవిరుద్ధమని సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.
ప్రజలు శాశ్వతంగా వలస వచ్చారని చెప్పడం వలన కార్మికులను అవమానించడమేనని.. తమిళనాడు ప్రజలు ప్రతినిధులను ఎన్నుకునే హక్కులో ప్రత్యక్ష జోక్యమన్నారు. ఛత్పూజ వంటి పండుగల సమయాల్లో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రానికి తిరిగి రాగలిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి రాలేరా? అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. చిదంబరం ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేస్తూ.. శాశ్వత, చట్టబద్ధమైన నివాసం ఉంటేనే ఏ వ్యక్తినైనా ఓటరు జాబితాలో చేర్చవచ్చన్నారు. వలస కార్మికుల నివాసం బీహార్, వారి సొంత రాష్ట్రంలో ఉంటే, వారిని తమిళనాడులో ఓటర్లుగా ఎలా చేర్చగలరని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాల ఎన్నికల గుర్తింపు, మోడల్ను మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం అంశంపై ప్రతిపక్షం పార్లమెంటులో నిరసన తెలుపుతోందని.. దానిపై చర్చకు డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ ఈ ప్రవర్తన ప్రజాస్వామ్యానికి ముప్పు అని దీన్ని విస్మరించలేమన్నారు.
ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి శాశ్వతంగా వలస వెళ్లారనే నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా? ఓటుహక్కు తొలగింపు అనేది తీవ్రమైన సమస్యని.. అందుకే సుప్రీంకోర్టు ఆయా పిటిషన్లను విచారిస్తోందన్నారు. చిదంబరం సోషల్ మీడియా పోస్ట్ను తమిళనాడు సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. అయతే, తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.