రైతులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-విలేకరులు
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. లైన్లో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పలుచోట్ల మంగళవారం ఉదయం నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాసినా.. దొరక్కపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం ముందు ఉదయం నుంచి రైతులు పట్టా పాస్బుక్కులతో ఆఫీస్ ముందు లైన్లో నిలబడ్డారు. 225 యూరియా బస్తాలు స్టాక్ ఉండటంతో ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే వ్యవసాయ అధికారులు టోకెన్ నెంబర్ కేటాయించి అందజేశారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భీంగల్ పట్టణంలోని రైతు సేవా సహకార సంఘానికి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఒక్కో రైతుకు రెండు బ్యాగుల చొప్పున వ్యవసాయ అధికారులు టోకెన్ ఇచ్చి పంపిణీ చేశారు. ఫోన్ నెంబర్ సహాయంతో ఓటీపీ తీసుకొని యూరియా అందజేశారు. పలువురికి ఓటీపీలు ఆలస్యంగా రావడంతో చిన్నపాటి తోపులాట జరిగింది.
పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించారు.కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవునిపల్లి, అంతంపల్లి గ్రామ సొసైటీ వద్ద తెల్లవారుజామునే రైతులు లైన్ కట్టారు. తాడ్వాయి మండలంలోని కృష్ణజివాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పోలీస్ పహారాతో యూరియా టోకెన్లు అందజేశారు. కృష్ణజివాడికి 222 బస్తాల యూరియా రాగా.. బ్రాహ్మణపల్లి రైతు వేదికలో 222 బస్తాల యూరియా కోసం అధికారులు పోలీసుల సహకారంతో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.