– భగ్గుమన్న పశ్చిమాసియా
– పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు
– ఇరాన్పై ఇజ్రాయిల్ ముందస్తు దాడులు
– అణు కేంద్రాలే లక్ష్యొం ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డు చీఫ్ , సైనిక కమాండర్లు, ఆరుగురు అణు శాస్త్రవేత్తలు సహా పలువురు మృతి
– యుద్ధాన్ని ప్రకటించడమేనన్న ఇరాన్
– కఠినమైన శిక్ష తప్పదన్న ఖమేని
– తొందరగా ఒప్పందం కుదుర్చుకోవాలన్న ట్రంప్
టెల్ అవీవ్, టెహరాన్: రెచ్చగొట్టే రీతిలో ఇరాన్పై ఇజ్రాయిల్ జరిపిన ముందస్తు దాడులతో పశ్చిమాసియా భగ్గుమంది. ఉద్రిక్తత లు మరింత పెచ్చరిల్లాయి. మధ్య ప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే గాజాపై భీకర దాడులతో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా వుండగా, అగ్నికి ఆజ్యం పోసేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయిల్ ముందస్తు దాడులకు పాల్పడింది. రాజధాని టెహరాన్ సహా ఇరాన్లోని పలు ప్రధాన నగరాల్లో, ప్రాంతాల్లో దాడులు జరిగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదటి దాడి జరగగా శుక్రవారం ఉదయం కూడా దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డు చీఫ్, సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలతో సహా పలువురు మరణించారు. 95మంది గాయపడ్డారు. మరణించిన వారిలో పలువురు కీలక ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. పలు అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి ఫ్యాక్టరీలు, మిలటరీ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ఇజ్రాయిల్ మిలటరీ వర్గాలు తెలిపాయి. టెహరాన్లో పలుసార్లు పేలుళ్ళ శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాక్ సరిహద్దుకు సమీపంలో కెర్మాన్షా ప్రాంతంలో భూగర్భంలో బాలిస్టిక్ క్షిపణులు నిల్వ చేసిన ప్రాంతంపై దాడి జరిగిన వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి. టెహరాన్కు పశ్చిమంగా అల్బోర్జ్ ప్రావిన్స్లో కూడా పలు చోట్ల పేలుళ్ళ శబ్దాలు, దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని మీడియా తెలిపింది. ఇది, అప్పటికప్పుడు ఏదో అనుకుని జరిపిన దాడి కాదు, ఈ దాడులకు నెలల తరబడి ముందస్తు ప్రణాళికలు రచించి, కోవర్టు ఆపరేషన్లకు పాల్పడి మరీ ఒక పద్ధతి ప్రకారం ఇజ్రాయిల్ ఈ దాడులకు తెగబడిందని తెలుస్తోంది. ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ మొసాద్ ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్నా రు. ఇరాన్ కూడా ఈ దాడులను ధృవీకరిం చింది. ఇది యుద్ధాన్ని ప్రకటించడమే అని వ్యాఖ్యానించింది. ఈ దాడులకు ప్రతిస్పందించే చట్టబద్ధమైన హక్కు ఇరాన్కు వుందని స్పష్టం చేసింది. తమ ప్రతిస్పందన కూడా అత్యంత శక్తివంతంగా ఉంటుందని ప్రతిన చేసింది. మరోవైపు ఇరాన్ తమ దేశంపై డ్రోన్లు, క్షిపణుల తో ప్రతి దాడులకు దిగే అవకాశముండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఇజ్రాయిల్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ దౌత్య కార్యాలయాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాన్సులార్ సేవలేవీ కూడా అందుబాటులో వుండవని తెలిపింది. ఇలా ఎంతకాలమనేది వెల్లడించలేదు. కాగా ఇరాన్పై దాడి నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చించేందుకు మరికాసేపట్లో భద్రతా మండలి సమావేశం కానుందని దౌత్యవేత్తలు తెలిపారు.
కొనసాగుతున్న దాడులు
ఇరాన్ భూభాగంలో నిర్దేశిత లక్ష్యాలపై దాడులు కొనసాగుతున్నాయని ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు కొద్ది నిమిషాల క్రితమే ఎక్స్లో పోస్టు పెట్టింది. గుర్తు తెలియని ప్రాంతంలో జరిగిన పేలుడు వీడియోను షేర్ చేసింది. అవసరమైనంత కాలం మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఏప్రిల్లోనే దాడికి ప్లాన్!
హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్య తర్వాత ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధిపరచడాన్ని మొదలుపెట్టిందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. టెలివిజన్లో ప్రసంగిస్తూ ఆయన, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపాలని ఆరు మాసాల క్రితమే ఆదేశించామనీ, ఏప్రిల్ చివరి నాటికల్లా ఈ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించాలని తొలుత భావించామని అన్నారు. అమెరికా మద్దతు లేకపోయినప్పటికీ ఇరాన్పై దాడిచేయడం తప్ప మరో అవకాశం ఇజ్రాయిల్కు లేదని చెప్పుకున్నారు. ముందుగానే అమెరికాకు తెలియజేశామని, ఇక ఇప్పుడేం చేస్తుందో వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. భవిష్యత్లో ఎలాంటి ముప్పు లేకుండా తమ దేశాన్ని రక్షించుకునేందుకే ఈ ముందస్తు దాడులు జరిపామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు.
15 అణు బాంబులు తయారుచేసే సామర్ధ్యం
డజన్ల సంఖ్యలో అణు, మిలటరీ లక్ష్యాలపై దాడులు జరిపామని ఇజ్రాయిల్ మిలటరీ అధికారి తెలిపారు. రోజుల వ్యవధిలోనే 15 అణు బాంబులు తయారుచేయగల సామగ్రి ఇరాన్ వద్ద సిద్ధంగా ఉందని ఆ అధికారి తెలిపారు. కాగా ఈ దాడితో అమెరికాకు ఎలాంటి సంబంధం, ప్రమేయం లేదని ఇద్దరు అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ ఏకపక్షంగా దాడికి దిగిందని చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఉన్నత సైనికాధికారులు అండర్గ్రౌండ్లో సమావేశమయ్యారు. ఇజ్రాయిల్ దాడులు, తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు అమెరికన్ మీడియా వర్గాలు తెలిపాయి. దాడులు, పేలుళ్ళ నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసినట్టు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ టివి తెలిపింది.
ఇజ్రాయిల్ దూకుడుకు కళ్ళెం వేయాలి
– ఇరాన్పై దాడులను తీవ్రంగా నిరసించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తీవ్రంగా నిరసించింది. తక్షణమే ఈ మిలటరీ ఆపరేషన్లను ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ, తన ఇష్టం వచ్చినట్లుగా పశ్చిమాసియాలోని దేశాలపై దాడులు జరుపుతూ ఇజ్రాయిల్ ఒక దుర్మార్గపు దేశంగా వ్యవహరిస్తోందని ఈ దాడులతో మరోసారి రుజువైందని పేర్కొంది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయిల్, ఇరాన్పై పలుసార్లు దాడులు చేసింది. ఈ దాడుల్లో సీనియర్ అణు శాస్త్రవేత్తలు, ఆర్మీ జనరల్స్, పలువురు పౌరులు మరణించారు. ఈ దాడి కోసం ముందుగానే నెలల తరబడి ప్రణాళికలు రచించినట్లు ఇజ్రాయిల ్అధికారుల ప్రకటనల ద్వారా తెలుస్తోంది. యావత్ పశ్చిమాసియా ప్రాంతంపై ఇజ్రాయిల్ గుత్తాధి పత్యాన్ని స్పష్టం చేయడమే ఈ దాడుల లక్ష్యంగా కనిపిస్తోంది. అమెరికా అధికారికంగా చేసిన ప్రకటనలతో సంబంధం లేకుండా చూస్తే, ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అమెరికా మద్దతు లేకుండా ఇంతటి స్థాయిలో మిలటరీ ఆపరేషన్ అమలు చేయడం సాధ్యం కాదన్నది సుస్పష్టం. ఈ మద్దతు లేకుండా ఇజ్రాయిల్కు అంత ధీమా రాదు లేదా ఇలాంటి దూకుడుతో కూడిన మిలటరీ ఆపరేషన్ అమలుచేసే సామర్ధ్యం వుండదు.
ఇజ్రాయిల్ అణ్వాయుధాలు కలిగివుందనేది అందరికీ తెలిసిన వాస్తవమే, కానీ ఆ ప్రాంతంలోని ఇతర దేశాలు శాంతియుత ప్రయోజనాల కోసమైనా అణు సాంకేతికతను అభివృద్ధి పరుచుకోకుండా అడ్డం కొట్టాలని ఇజ్రాయిల్ చూస్తోంది. అణు అంశాలపై ఇరాన్తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరగడంతో మరింత విస్తృతమైన స్థాయిలో ప్రాంతీయ ఘర్షణలు పెచ్చరిల్లే అవకాశం వుంది. పశ్చిమాసియా మొత్తంగా తీవ్రమైన అస్థిరతలో కూరుకుపోయే ప్రమాదముంది. గత 20మాసాలుగా, పాలస్తీనాపై ఇజ్రాయిల్ మారణకాండ కొనసాగిస్తూనే వుంది. ఇప్పుడు, ఇరాన్పై ఈ దాడితో, ఈ ప్రాంతంలో తన ఆధిపత్యానికి సవాలు ఎదురవుతుందనుకుంటే వెంటనే దాన్ని నిర్మూలిం చాలని ఇజ్రాయిల్ భావిస్తోంది.
ఐక్యరాజ్య సమితి నేతృ త్వంలో అంతర్జాతీయ సమాజం ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే జోక్యం చేసుకుని ఇజ్రాయిల్ దూకూడుకు కళ్ళెం వేయాలి. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండి స్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా తన వాణిని వినిపించాలి. తక్షణమే మిలటరీ ఆపరేషన్లను విరమించాల్సిందిగా ఇజ్రాయిల్ను కోరాలి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో గురువారం పాలస్తీనాకు మద్దతుపై జరిగిన ఓటింగ్కు భారత్ గైర్హాజరవడం అత్యంత విచారకరం. ఇటువంటి చర్యలు ఇజ్రాయిల్కు మరింత ధైర్యాన్ని కల్పించడానికి, ఈ ప్రాంతంలో తన దాడులను కొనసాగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇరాన్, పాలస్తీనాలతో భారత్కు దీర్ఘకాల సంబంధాలు వున్నాయి. వాటిని గౌరవిస్తూ, బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వుంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్కు పరోక్షంగా ఇస్తున్న మద్దతుకు స్వస్తి పలికి, పశ్చిమాసియాలో శాంతి, న్యాయం కోసం స్పష్టమైన వైఖరి తీసుకోవాలి.
పలు దేశాల ఖండన
ఐరాస నిబంధనావళిని ఉల్లంఘించడమే : రష్యా
ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిందని, ఇది ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని ఉల్లంఘించడమేనని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ విమర్శించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై పశ్చిమదేశాల ఆందోళనలను తోసిపుచ్చుతూ ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇజ్రాయిల్ వాటిని నాశనం చేసేలా ఇలాంటి చర్యలకు దిగడాన్ని రష్యా ఖండించింది. కాగా రష్యా సహకారంతో నిర్మించిన బుషర్ అణు విద్యుత్ ప్లాంట్పై దాడి జరగలేదని తెలుస్తోంది. తక్షణమే ఇరుపక్షాలు ఉద్రిక్తతల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని పోలెండ్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కోరారు. ఇలాంటి దాడుల వల్ల ప్రమాదకరమైన పర్యవసానాలు తలెత్తే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్పై దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షక సంస్థ ఐఎఇఎ బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. మరోవైపు బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్, టర్కీలు ఈ దాడులను ఖండించాయి. ఉద్రిక్తతల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇది రెచ్చగొట్టే చర్య అని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాత్రం ఇజ్రాయిల్ చర్యను సమర్థించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇజ్రాయిల్ కఠిన శిక్షను ఎదుర్కొనాల్సిందే
ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామి, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మహమ్మద్ బఘెరి, ఆరుగురు అణు శాస్త్రవేత్తలు మరణించారని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. ఇతర నివాస ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయని తెలిపింది. సలామి మృతిని ఇరాన్ అధికార మీడియా కూడా ధృవీకరించింది. ఇజ్రాయిల్ కఠిన శిక్షను ఎదుర్కొనాల్సి వుంటుందని, తమ ప్రతిస్పందన కూడా అత్యంత శక్తివంతంగా ఉంటుందని ఇరాన్ మతపెద్ద ఆయతుల్లా అలీ ఖమేని ప్రకటించారు. ఈ దాడులకు సమాధానంగా వందలాది డ్రోన్లతో, క్షిపణులతో ఇజ్రాయిల్పై దాడికి సిద్ధమైంది. దాదాపు వంద డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిందని, తమ సైన్యం వాటిని అడ్డగిస్తోందని ఇజ్రాయిల్ మిలటరీ తెలిపింది. వెంటనే ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
ఇది పిరికిపంద చర్య అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ఖండించారు. కువైట్ విదేశాంగ మంత్రితో ఫోన్కాల్లో మాట్లాడుతూ ఆయన, దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజలను భద్రతను రక్షించుకోవడానికి పూర్తి కృత నిశ్చయంతో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
నంటాజ్ అణు కేంద్రంలో అణు ధార్మికత?
ఇజ్రాయిల్ దాడి తర్వాత నంటాజ్ అణు కేంద్రం లోపల రసాయన చర్య లేదా అణు ధార్మికత వెలువడిందని కనుగొన్నారు. అయితే ఇదంతా కూడా అణు సముదాయానికి లోపలే తప్ప వెలుపల కాదని ఇరాన్ అణు ఇంధన సంస్థ వెల్లడించింది. ప్లాంట్కు వెలుపల ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ సంస్థ చీఫ్ మహ్మద్ ఇస్లామి చెప్పారు. అయితే అణు కేంద్రం లోపల ప్రక్షాళన పనులు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ దాడులతో జరిగిన నష్టం ఉపరితల ప్రాంతాలకే పరిమితమైందని చెప్పారు.
ప్రాచ్యానికి మిలటరీ ఆస్తులను తరలిస్తున్న అమెరికా
నౌకలతో సహా మిలటరీ వనరులను పెద్ద ఎత్తున పశ్చిమాసియా ప్రాంతానికి తరలిస్తున్నట్టు అమెరికా అధికారులు ఇరువురు మీడియాకు తెలిపారు.
సమయం మించి పోలేదు, ఒప్పందం కుదుర్చుకోండి : అమెరికా
ఈ పరిస్థితుల్లో అమెరికాతో వెంటనే అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను కోరారు. ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతాయని ఆయన హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో మొదటిసారిగా స్పందిస్తూ, ”ఈ మారణహోమానికి అంతం పలకడానికి ఇంకా సమయం వుంది. ఇప్పటికే ప్రణాళిక ప్రకారం రూపొందించిన దాడులు మరింత దారుణంగా, క్రూరంగా ఉండ బోతాయి.” అని వ్యాఖ్యానిం చారు. ఇజ్రాయిల్ దాడులను అద్భుతమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
దాడి ఎందుకు?
ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ఈ దాడులను ”ఆపరేషన్ రైజింగ్ లయన్” గా అభివర్ణించారు. ఇరాన్ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా, ఇజ్రాయిల్ దేశ భద్రత కోసం చేసిన దాడులని పేర్కొన్నారు. అవసరమైనంత కాలం ఈ మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు తమ 200 యుద్ధ విమానాలు ఇరాన్లోని 100 లక్ష్యాలను ఛేదించాయని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో నాటంజ్లోని అణు ఇంధన సమృద్ధి కేంద్రం, టెహరాన్ సమీపంలోని పార్చిన సైనిక స్థావరం, ఇతర సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని తెలిపింది.
దాడులకు ముందుగా పలు కోవర్టు అపరేషన్లు ! ఇరాన్లోనే రహస్య స్థావరాలు
ఇరాన్పై దాడులకు తెగబడడానికి ముందుగా ఇజ్రాయిల్ పలుసార్లు కోవర్డ్ ఆపరేషన్లు చేపట్టిందని తెలుస్తోంది. ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ మొసాద్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆపరేషన్కు ముందుగా ఇరాన్లో రహస్యంగా పేలుడు పదార్ధాలతో కూడిన డ్రోన్ స్థావరాన్ని మొసాద్ నిర్మించినట్లు ఇజ్రాయిల్ అధికారిని ఉటంకిస్తూ మీడియా తెలిపింది. టెహరాన్ సమీపంలోని బాలిస్టిక్ క్షిపణి లాంచర్లపై దాడులకు వీటిని ఉపయోగించినట్లు చెప్పారు. ఆయుధాలతో నిండిన పలు వాహనాలను ఇరాన్లోకి అక్రమంగా రవాణా చేశారు. సెంట్రల్ ఇరాన్లో విమాన విధ్వంసక వ్యవస్థలు గల స్థావరాలకు సమీపంలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మొసాద్ కమాండోలు మోహరించారు. ఇందుకు సంబంధించిన ఫుటేజీని కూడా ఆ సంస్థ విడుదల చేసింది.