గాజా వాసుల కన్నీటి వెతలు
కాల్పుల విరమణ జరిగినా మారని బతుకులు
గాజా : ఇజ్రాయిల్-హమాస్ మధ్య గత నెలలో కాల్పుల విరమణ జరిగినప్పటికీ గాజాలోని పాలస్తీనియన్ల బతుకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో 31 సంవత్సరాల హనన్ అల్-జోజో తన ముగ్గురు పిల్లలకు ఫ్లాష్లైటు వెలుగులోనే ఆహారాన్ని అందిస్తోంది. కరెంటు లేకపోవడంతో చాలా చోట్ల ఫ్లాష్లైట్లు కూడా పనిచేయడం లేదు. ‘చీకటిలో మగ్గిపోతున్నాం. సూర్యాస్తమం అయినప్పుడు ప్రార్థనలు చేస్తాం. ఫ్లాష్లైటులో లైటు ఉంటే దానిని వెలిగిస్తాం. లేకుంటే భోజనం చేయకుండానే పడుకుంటాం’ అని ఆమె చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె కుటుంబానికి విద్యుత్ సౌకర్యమే లేకుండా పోయింది. వారు గాజా నుంచి తొలుత రఫా నగరానికి చేరుకున్నారు. అక్కడ కూడా వారికి కొవ్వొత్తులే దిక్కయ్యాయి.
‘ఎట్టకేలకు ఒక ఎల్ఈడీ బల్బు పెట్టుకున్నాం. కానీ అది పగిలిపోయింది. కొత్తది కొనడానికి మా వద్ద డబ్బు లేదు. బ్యాటరీని తెచ్చుకోవాలని ప్రయత్నించాం. కానీ దాని ఖరీదు ఎక్కువ. అందుబాటులో కూడా లేదు’ అని అల్-జోజో చెప్పారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గాజా వాసులు ప్రధానంగా ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న విద్యుత్పై ఆధారపడే వారు. అయితే యుద్ధ సమయంలో దాని సరఫరా సరిగా జరగలేదు. గాజాకు ఇజ్రాయిల్ నుంచి 120 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగేది. గాజాలో ఉన్న ఏకైక విద్యుత్ ప్లాంటులో 60 మెగావాట్ల ఉత్పత్తి జరిగేది.
అయితే యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే విద్యుత్ ప్లాంటుకు ఇంధన కొరత ఎదురైంది. సెంట్రల్ గాజాలో ఆశ్రయం పొందుతున్న వారు ప్రస్తుతం సూర్యాస్తమయం లోపే తమ పనులన్నింటినీ ముగించుకుంటున్నారు. కొందరు సౌర విద్యుత్ ద్వారా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. హమాస్పై ప్రతీకారేచ్ఛతో గాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఇజ్రాయిల్ మంత్రి ఎలి కోహెన్ మార్చిలో ఆదేశాలు జారీ చేశారు. కాల్పుల విరమణ మొదలైన తర్వాత శిథిలాలను తొలగించడానికి అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేయాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం సాధ్యపడడం లేదు.



