Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచిరుతను పట్టుకున్నాం

చిరుతను పట్టుకున్నాం

- Advertisement -

– వన్యప్రాణులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– కనిపిస్తే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 040-23231772కు సమాచారమివ్వండి
– అటవీ అధికారులకు ప్రజలు సహకరించాలి : పీసీసీఎఫ్‌ చీఫ్‌ డాక్టర్‌ సి. సువర్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మంచిరేవుల టెక్‌ పార్కు వద్ద సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకున్నామని అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌) డాక్టర్‌ సి.సువర్ణ తెలిపారు. రాష్ట్రంలో చిరుతల సంచారం ఎక్కువైందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. వన్యప్రాణులు కనిపిస్తే వాటిపై దాడి చేయొద్దనీ, టోల్‌ఫ్రీ నెంబర్‌ 040-23231772 ద్వారా సమాచారాన్ని అటవీ అధికారులకు చేరవేయాలని కోరారు. మీడియా కూడా సహకరించాలనీ, సోషల్‌మీడియా వేదికగా జరిగే ప్రచారాన్ని నిర్ధారించుకోకుండా వేయరాదని విన్నవించారు. గురువారం హైదరా బాద్‌లోని అరణ్యభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…టెక్‌ పార్కులో జూలై 7న తొలిసారి చిరుత కనిపించిందనీ, ఏడు కెమెరాలతో ట్రాప్‌ చేశామని తెలిపారు. మంచిరేవుల వద్ద తమ అధికారులు బోను ఏర్పాటుచేసి బుధవారం రాత్రి పట్టుకున్నారని చెప్పారు. టైగర్‌ కంటే చిరుత తెలివిగా, యాక్టీవ్‌గా ఉంటుందన్నారు. బంధించిన చిరుత 50 కేజీల బరువు ఉందని, నెహ్రూజూలాజిక్‌ పార్కులో మెడికల్‌ చెప్‌ చేసిన తర్వాత అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టులో గురువారం వదిలిపెట్టామని తెలిపారు. వన్యప్రాణుల దాడిలో చనిపోయిన వారికి ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామ న్నారు. గాయపడిన వారికి వైద్యపరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామనీ, వారికి కూడా గాయ తీవ్రతను పట్టి పరిహారం ఇస్తున్నామని చెప్పారు. వాటి దాడిలో పశువులు మరణించినా వాటికి కూడా పరిహారం ఇస్తున్నామని తెలిపారు. పంటనష్టం జరిగితే రూ.7 వేల పరిహారం ఇస్తున్నామన్నారు. ఎవరైనా జంతువులకు హాని కలిగించే పనులు చేస్తే వారిపై కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. టైగర్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌కు కేంద్రం 2015లో అనుమతి ఇచ్చి తిరిగి 2017లో ఉపసంహరించుకుందనీ, కేంద్రం ఇచ్చే ఫండ్స్‌లో కోత విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం ముందుకు పోలేదని వివరించారు. రాష్ట్రంలో పులులు, చిరుతల వివరాలు తేల్చేందుకు ఎన్టీసీకి లేఖ రాశామన్నారు. అమ్రాబాద్‌ ఫారెస్టులో 5 గ్రామాలను రీ లొకేటెడ్‌ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని తెలిపారు.
కవ్వాల్‌ కన్జర్వేషన్‌ రిజర్వు కింద 85 గ్రామాలున్నాయని, 300గ్రామాలకు పైగా బయట ఉన్నాయని తెలిపారు. ప్రజల్లో వచ్చిన నిరసనతో జీవో 49ను ఉపసంహరిం చుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో ఆ జీవోపై పరిశీలిస్తామన్నారు. కంపా నిధులతో ప్లాంటింగ్‌, నర్సరీల పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఫారెస్టు స్టేషన్లకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో నాన్‌ ప్రొటెక్టెడ్‌ ఏరియాలో అండర్‌ పాసులు ఏర్పాటు చేయబో తున్నామని తెలిపారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఏలుసింగ్‌ మేరు, శంకరన్‌, ప్రియాంక వర్గీస్‌, రంగారెడ్డి డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, అటవీశాఖ అధికారులు రవిప్రకాశ్‌, నిఖిత, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -