Tuesday, December 16, 2025
E-PAPER
Homeజాతీయంమావోయిస్టులను ఆర్థికంగా దెబ్బతీశాం

మావోయిస్టులను ఆర్థికంగా దెబ్బతీశాం

- Advertisement -

వారి ప్రభావం బాగా తగ్గిపోయింది : కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ : గడచిన 11 ఏండ్ల కాలంలో పలు భద్రతా సంస్థలు మావోయిస్టులను ఆర్థికంగా దెబ్బతీశాయని, రూ.92 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని, వారి సమాచార యుద్ధ వ్యవస్థల్లోకి ప్రవేశించి వాటిని తీవ్రంగా నియంత్రించడం ద్వారా అర్బన్‌ నక్సల్స్‌కు నైతిక, మానసిక నష్టాన్ని కలిగించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘ఎన్‌ఐఏలో మావోయిస్టులకు వ్యతిరేకంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతో అది రూ.40 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రాలు మరో రూ.40 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నాయి. రూ.12 కోట్లను ఈడీ జప్తు చేసింది. ఏకకాలంలో తీసుకున్న చర్యల కారణంగా అర్బన్‌ నక్సల్స్‌ నైతికంగా, మానసికంగా నష్టపోయారు’ అని వివరించింది.

దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 2026 మార్చి 31 ని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ దిశగా తీసుకున్న చర్యలను ప్రభుత్వం వివరిస్తూ 2014లో దేశంలో మావోయిస్టు ప్రభావానికి తీవ్రంగా గురైన జిల్లాలు 36 ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య మూడుకు తగ్గిందని చెప్పింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 317 మంది మావోయిస్టులను న్యూట్రల్‌ చేశామని, 862 మంది అరెస్టయ్యారని, 1,973 మంది లొంగిపోయారని తెలియజేసింది. గతేడాది ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఈ ఏడాది ఐదుగురు సహా మొత్తం 28 మంది ప్రముఖ నేతలు లొంగిపోవడమో, అరెస్టవడమో లేదా ఎన్‌కౌంటర్లలో చనిపోవడమో జరిగిందని వివరించింది.

‘ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌లో 27మంది కరడుకట్టిన మావోయిస్టులు హతమయ్యారు. మే 23న బీజపూర్‌లో 24 మంది లొంగిపోయారు. అక్టోబరులో ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో 258 మంది లొంగిపోయారు. వీరిలో పది మంది సీనియర్‌ నేతలు. 2014లో దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 126 ఉంటే ఇప్పుడు 11 మాత్రమే ఉన్నాయి. గత పదేండ్లల్లో పటిష్టవంతమైన పోలీస్‌ స్టేషన్ల సంఖ్య 66 నుంచి 586కు పెరిగింది. దేశంలో తీవ్రవాద సంబంధమైన ఘటనల సంఖ్య తగ్గింది. 2013లో 76 జిల్లాల్లో 330 ఘటనలు నమోదు కాగా ఈ ఏడాది జూన్‌ నాటికి 22 జిల్లాల్లో 52 ఘటనలు నమోదయ్యాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా దేశంలో గడచిన 11 ఏండ్లలో మావోయిస్టుల హింస 70 శాతం తగ్గింది’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -