నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా కప్ గెలిచిన ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ దురదృష్టకర ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందిస్తూ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ తమ సొంత మైదానంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ “ఐపీఎల్ ఫైనల్ ముగిసి, బహుమతుల ప్రదానోత్సవం పూర్తయిన తర్వాత ఫ్రాంచైజీ తమ హోమ్ గ్రౌండ్లో ఏం చేస్తుందనే దానితో బీసీసీఐకి ఎలాంటి సంబంధం ఉండదు” అని స్పష్టం చేశారు. “(ఆర్సీబీ) మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐకి లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
“బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ లేదా వేడుకలు ప్లాన్ చేసినట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరు దీనిని నిర్వహించారో, అంతమంది అభిమానులు ఎలా అక్కడికి వచ్చారో మాకు తెలియదు” అని సైకియా తెలిపారు. “ఆర్సీబీ యాజమాన్యం కూడా స్టేడియం లోపల ఉండటం వల్ల బయట ఏం జరుగుతుందో వారికి తెలియదు. విషయం తెలిసిన వెంటనే మేము ఆర్సీబీ అధికారులతో మాట్లాడాము. వారు వేడుకలను ముగిస్తున్నట్లు మాకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం కూడా ఈ ఘటనను గమనిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను” అని ఆయన వివరించారు.