పెండింగ్ బిల్లుల చెల్లింపులో సీపీఎస్ ఉద్యోగుల వాటా ఎంత? : టీఎస్సీపీఎస్ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులు ఎంతో నిధుల్లో అంత వాటా ఇవ్వాలని టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదనీ, అందులో సీపీఎస్ ఉద్యోగులకు రూ.వంద కోట్లు చెల్లించలేని స్థితి ప్రభుత్వానికి ఉన్నదా?అని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్లో టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం పోరు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చాలని కోరారు.
సీపీఎస్ విధానంలో ఉద్యోగ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగికి అన్ని వాయిదాలు చెల్లించిన తర్వాతే మార్కెట్ నుంచి పెన్షన్ కొనుక్కునే దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అటు పాత పెన్షన్ లేక, ఇటు కొత్త పెన్షన్ రాక రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెన్షన్ లేకుండా కుటుంబాన్ని ఎలా పోషిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాం, కోశాధికారి నరేష్గౌడ్, హైదరాబాద్ అధ్యక్షులు నరేందర్రావు, నాయులు శ్యామ్ సుందర్, పవన్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, వెంకటేశ్, శ్రవణ్, చంద్రకాంత్, రాఘవేంద్ర, నిస్సార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.



