– ఏఐఎఫ్ఎఫ్కు ఐఎస్ఎల్ క్లబ్ల హెచ్చరిక
– ప్రమాదంలో భారత ఫుట్బాల్ భవిష్యత్
నవతెలంగాణ-న్యూఢిల్లీ : భారత ఫుట్బాల్ సమాఖ్యలో పరిపాలన శూన్యత మరిన్ని సమస్యలకు దారితీస్తోంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎఎస్ఎల్) మాస్టర్ రైట్స్ అగ్రీమెంట్ (ఎంఆర్ఏ) ఒప్పందం రెన్యువల్ ప్రక్రియ నిలిచిపోవటంతో.. ఈ ఏడాది ఫుట్బాల్ లీగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అలసత్వాన్ని ఇన్నాండ్లూ మౌనంగా భరించిన ఐఎస్ఎల్ ప్రాంఛైజీ క్లబ్లు ఇప్పుడు నెమ్మదిగా గళం విప్పుతున్నాయి. ఐఎస్ఎల్లో 13 క్లబ్లు ఉండగా.. 11 క్లబ్లు శుక్రవారం ఏఐఎఫ్ఎఫ్కి ఓ లేఖ రాశాయి. భారత ఫుట్బాల్ భవిష్యత్ను ప్రమాదంలో పడేసిన ఈ సంకట స్థితి నుంచి గట్టెక్కే మార్గం కోసం సుప్రీంకోర్టుకు తాజా పరిణామాలను వివరిస్తారా? లేదంటే స్వయంగా క్లబ్లే సుప్రీంకోర్టులో న్యాయ ప్రక్రియను మొదలుపెట్టాలా? అనేది తేల్చాలని సూటిగా ప్రశ్నించారు. మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్ క్లబ్లు ఈ లేఖపై సంతకం చేయలేదు.
‘భారత్లో ఫుట్బాల్ చట్టబద్దమైన రెగ్యులేటరీ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్. సుప్రీంకోర్టులో ఏఐఎఫ్ఎఫ్ రాజ్యాంగంపై తీర్పు పెండింగ్లో ఉంది. ఆ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి, ఈ కేసులో ఎటువంటి మధ్యంతర పిటిషన్లు వేయడానికైనా ఫుట్బాల్ బాడీకి న్యాయపరంగా అన్ని అవకాశాలు ఉన్నాయి. భారత ఫుట్బాల్ భవిష్యత్, ప్రస్తుత పరిణామాలను గమనంలో ఉంచుకుని ఏఐఎఫ్ఎఫ్ తక్షణమే సుప్రీంకోర్టులో ఓ పిటిషను దాఖలు చేయాలి. ఐఎస్ఎల్ సీజన్ ఆరంభానికి ఆటంకం తొలిగిలే తాత్కాలిక లేదా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరాలి. ఐఎస్ఎల్ ఎంఆర్ఏ ఈ ఏడాది ముగుస్తుందని తెలిసినా.. ఏఐఎఫ్ఎఫ్ ఇప్పటివరకు ఈ పని ఎందుకు చేయలేదనే విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. ఒకవేళ ఈ పని ఏఐఎఫ్ఎఫ్ చేయకుంటే… ఐఎస్ఎల్ క్లబ్లే స్వయంగా సుప్రీంకోర్టు తలుపు తడతాయి. భారత ఫుట్బాల్ను కాపాడుకునేందుకు మాకున్న ఆ ఆఖర అవకాశాన్ని వదులుకోలేమని’ ఏఐఎఫ్ఎఫ్కు రాసిన లేఖలో క్లబ్లు పేర్కొన్నాయి. న్యూఢిల్లీలో ఏఐఎఫ్ఎఫ్, ఐఎస్ఎల్ క్లబ్లు, ఇతర భాగస్వాములతో సమావేశం జరిగిన ఒక రోజులోనే ఈ లేఖ రాయటం గమనార్హం. ఇటీవల సమావేశంలో ఐఎస్ఎల్ ఎంఆర్ఏ రెన్యువల్ వేగవంతం చేయటం కాకుండా… సూపర్ కప్తో ఫుట్బాల్ సీజన్ను ఆరంభించాలనే తపనతోనే ఫుట్బాల్ సమాఖ్య ఉండటం క్లబ్లకు ఏమాత్రం నచ్చలేదని సమాచారం. అందుకే, సూపర్ కప్లో పోటీపడేందుకు అన్ని క్లబ్లు సుముఖంగా లేవని తెలుస్తోంది.
ఐఎస్ఎల్ క్లబ్లు రాసిన లేఖపై ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చౌబె స్పందించారు.’ లేఖ అందింది. ఐఎస్ఎల్ అనిశ్చితి సుమారు 5000 కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని సమాచారం. ఈ అనిశ్చితికి తెరదించేందుకు ఏఐఎఫ్ఎఫ్ శాయశక్తులా కషి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేయటంపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఐఎస్ఎల్ క్లబ్లు సుప్రీంకోర్టుకు వెళ్లి పరిష్కారం తీసుకొచ్చినా సంతోషమే’ అని చౌబె అన్నారు.
ఏఐఎఫ్ఎఫ్తో ఎఫ్ఎస్డిఎల్ 15 ఏండ్ల ఒప్పందం కుదుర్చుకుంది. 15 ఏండ్ల మాస్టర్ రైట్స్ అగ్రీమెంట్ ఈ ఏడాది డిసెంబర్లో ముగియనుంది. దీంతో ఈ సీజన్ ఐఎస్ఎల్ను ఇంకా ఆరంభించలేదు. ఎంఆర్ఏపై స్పష్టత లేకుండా సీజన్లో ఆడేందుకు క్లబ్లు ఏమాత్రం సుముఖంగా లేవు. ఎంఆర్ఏపై ఏఐఎఫ్ఎఫ్ సంప్రదింపుల కమిటీ వేసినా.. అప్పటికే సుప్రీంకోర్టులో ఆ సమాఖ్య రాజ్యాంగంపై కేసు ఉండటంతో దానితో ఉపయోగం లేకుండా పోయింది
మేమే సుప్రీంకోర్టుకు వెళ్తాం!
- Advertisement -
- Advertisement -