Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతిలో పట్టాలిచ్చి, హక్కులు కల్పిస్తాం..

భూభారతిలో పట్టాలిచ్చి, హక్కులు కల్పిస్తాం..

- Advertisement -

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ – గణపురం 
: దున్నుకునే వారికి అన్ని హక్కులు కల్పించి పట్టాలు ఇస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం గణపురం మండలం బుద్దారం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులలో ప్రజలు తమ భూములకు సంబంధించిన సమస్యపై దరఖాస్తులు ఇవ్వాలని, ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా  తహసీల్దార్ విచారణ నిర్వహించి పట్టా జారీ చేస్తారని తెలిపారు. తహసీల్దార్ పనిచేయకపోతే, ఆర్డిఓకు, కలెక్టర్  పిర్యాదు చేయొచ్చని,  వీళ్లు కూడా పరిష్కరించకపోతే ప్రభుత్వం ఉచిత సేవలతో ల్యాండ్ ట్రిబ్యునల్ కు వెళ్లడానికి భూ భారతి చట్టంలో అవకాశం కల్పించామని అన్నారు. ప్రజలు ఇతరులకు సమాచారం అందించి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. భూ భారతిలో పట్టాలు ఇచ్చి హక్కులు కల్పిస్తామని తెలిపారు. ప్రజలు భూ భారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సర్వే నెంబర్ లో రెండెకరాల భూమి ఉంటే ఓక ఎకరం మాత్రమే నమోదు జరిగిందని మిగతాది సర్వే నంబర్లు నమోదుగాక రైతుల ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు.  మనభూమి వేరొకళ్ళు దున్నుకుంటుంటే ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని, అలాంటి సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వం తెచ్చిన ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టం తెచ్చినట్లు తెలిపారు. 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ… అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహణకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారాం గ్రామ సభలు జరుగుతాయని స్పష్టం చేశారు. జూన్ 3 నుంచి 20 తేది వరకు అన్ని గ్రామాల్లో  రెవెన్యూ సదస్సులు జరుగుతాయని అన్నారు.  రెవెన్యూ అధికారులు షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాలకు వస్తారని భూ భారతి రెవెన్యూ సందస్సులలో సమస్యలపై ప్రజలు  దరఖాస్తులు పూర్తి చేసి ఇవ్వాలని ఆయన సూచించారు.  వచ్చిన దరఖాస్తులు ఆధారంగా  పహాని, రెవెన్యూ మ్యాప్ లో పరిశీలిస్తారని ఆయన తెలిపారు.  భూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వారి యొక్క సమస్యలకు సంబంధించినటువంటి విజ్ఞాపనలు అందజేయాలన్నారు. విచారణ తదుపరి సమస్యలు పరిష్కారానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.  20 తేది వరకు అన్ని గ్రామాలలో  సదస్సులు నిర్వహించి దరఖాస్తుల స్వీకరిస్తామని,  వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ప్రజలు  సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సత్యనారాయణ స్వామి,  ఎంపిడిఓ భాస్కర్, సింగిల్ విండో  అధ్యక్షులు కుమార్ యాదవ్,  డిసిఎమ్మెస్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -