Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

- Advertisement -

– సరుకుల సరఫరాలో అలసత్వం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు
– 90 శాతం చిన్నారుల హాజరే లక్ష్యం
– డిసెంబర్‌ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి : మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలుంటే సహించబోమనీ, సరుకుల సరఫరాలో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై ఆ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనె, బాలామృతం, మురుకులు, బియ్యం వంటి వస్తువుల సరఫరాపై జిల్లాలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో సరఫరా 50 శాతానికి కూడా చేరకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా సరఫరాదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్‌ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. చిన్నారుల సంరక్షణలో అంగన్‌వాడీ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. టేక్‌ హౌమ్‌ రేషన్‌ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ విజయవంతంగా అమలవుతున్నదని తెలిపారు. ప్రస్తుతం 90 శాతం లబ్దిదారులు ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో సరుకులు అందుకుంటుండగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్‌ కనెక్షన్‌, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను ఉదయం తొమ్మిది గంటల లోపు తెరవకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నెలా కనీసం ఒక కొత్త చిన్నారి చేరేలా చర్యలు తీసుకోవాలనీ, ప్లే స్కూళ్ల స్థాయిలోనే విద్యా నాణ్యత ఉండేలా తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు. ఈ నెలలో ఇప్పటి వరకు గర్భిణుల హాజరు 80 శాతం, బాలింతల హాజరు 85 శాతం ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల హాజరు శాతాన్ని 68 నుంచి 90 శాతానికి పెంచాలని నిర్దేశించారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారాలని ఆకాంక్షించారు. జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి బాల్య వివాహాలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శక్తి సదనాలు, స్టే హౌమ్స్‌, వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి పర్యవేక్షించాలని సూచించారు. మంత్రి సీతక్కతో పాటు సమీక్షలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ శృతి ఓజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -