Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకులాలను సమాధి చేస్తే సహించం

గురుకులాలను సమాధి చేస్తే సహించం

- Advertisement -

– కిరాయి కట్టకుండా రూ.2.5 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
– విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కాంగ్రెస్‌పై సమరశంఖం : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గురుకులాలను సమాధి చేసేందుకు పన్నాగం చేస్తే సహించే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. రెసిడెన్షియల్‌ వ్యవస్థను బలిపెడితే ఊరుకునేది లేదన్నారు. గురు కులాల అద్దె భవనాలకు ఏడాది కాలంగా కిరాయి కట్టని కాంగ్రెస్‌ సర్కారు అప్పు తెచ్చిన రూ.2.5 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అద్దె బకాయిలు చెల్లించాలనీ, విద్యార్థులు నష్టపోకుండా చూడాలనీ, భవనాలకు తాళాలు వేయకుండా నిరోధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి కాంగ్రెస్‌ సర్కారుపై సమర శంఖం పూరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్‌ విమర్శించారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసమర్థత, చేతకాని తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి అద్దె బకాయిలు చెల్లించక పోవడాన్ని ఆయన తప్పు బట్టారు. కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపే యాలన్న కుట్రలో భాగంగానే సీఎం రేవంత్‌ ఇదంతా చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. రెండేళ్లు నిండకుండానే రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేసి కనీసం అద్దె భవనాల బకాయిలు చెల్లించలేదని తెలిపారు. గురుకులాలకు తాళం వేసే పరిస్థితి వస్తే నిరంకుశ కాంగ్రెస్‌కు, రేవంత్‌ రెడ్డికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుతా మని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -