నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నిరుపేద షెడ్యూలు కులాల కు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని ఆక్రమణకు గురి కాకుండా భద్రత కల్పిస్తూ రక్షణ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి పలు విజ్ఞప్తులు ఫిర్యాదులపై దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులలో కొన్ని ఈ విధంగా ఉన్నాయనారు. 1971 సంవత్సరంలో భువనగిరి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో 85 సర్వేనెంబర్ లోని నాలుగు ఎకరాల భూమిని షెడ్యూల్ కులాలకు ఇల్లు నిర్మించుకునేందుకు అందజేయడం జరిగిందని, సుమారు రెండు ఎకరాలలో 33 కుటుంబాలు ఇండ్లు నిర్మించుకోగా, రెండు ఎకరాల భూమి ఉందని, పరిసరాలలోని ఇతర కులస్తులు స్థలాన్ని ఆక్రమిస్తున్నారని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో కనీసం భద్రత అయినా కల్పించాలని దాసరి స్వామి, రామచంద్రయ్య, కూరం పోశాల్, దాసరి రాములు, జైపాల్, అశోక్, జంగిడి గండయ్య, రావుల అయోధ్య లు కలెక్టర్కు విజ్ఞప్తిని అందజేశారు. వార్డులోని బొమ్మాయిపల్లి కి చెందిన సర్వే నెంబర్ 118 లో వెనుకబడిన తరగతుల వారికి 68 ప్లాట్లు మంజూరు చేశారని, ప్లాట్ లకు లేఅవుట్ చేయించి, హద్దులు గుర్తించి, నెంబర్లు వేయించి ఇవ్వాలని భవాని, విజయలక్ష్మి, రేణుక, సుశీల, అనిత తెలిపారు.
జిల్లాలోని చౌక ధర దుకాణాల డీలర్లు తమ విజ్ఞప్తిని అందజేస్తూ మార్చి మాసం నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున సుమారు 350 షాపులలో ఫిబ్రవరి మాసం నుండి దొడ్డు బియ్యం పంపిణీ నిలిపి వేసినందున స్టాక్ నిల్వ ఉన్నదని, అటు స్టాక్ నిల్వ ఉండటం వర్షాకాలంలో బియ్యం తడిసే పరిస్థితి ఉన్న దని అంతేకాకుండా పురుగు పడుతున్నదని ఇదే పురుగు సన్న బియ్యం కూడా పట్టే ప్రమాదం ఉన్నందున దొడ్డు బియ్యం స్టాకును త్వరతగతిన తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తిని అందజేశారు. సన్న బియ్యం తూకం వేసి ఇవ్వాలని విజ్ఞప్తిని డీలర్ల తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఎలగల రాజయ్య తోపాటు 12 మండలాల డీలర్లు గ్రీవెన్స్ సెల్ కు విచ్చేసి అందజేశారు. బీబీనగర్ మండలం గూడూరు కు చెందిన గుమ్మడి జగదీష్ తన దరఖాస్తు అందిస్తూ తనకు 65 సంవత్సరంలు ఉన్నాయని, దివ్యాంగుడు నని, తనకు పెన్షన్ మంజూరు చేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విజ్ఞప్తిని అధికారులు సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, జెడ్పి సిఈఓ శోభారాణి డిఆర్డిఓ నాగిరెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు.