- Advertisement -
- సీఎం రేవంత్ బీసీ ఉద్యమానికి ఊపిరి పోశారు
- 15న కామారెడ్డి సభతో కేంద్రం మెడలు వంచుతాం : పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
- మంత్రులతో కలిసి సభాస్థలి పరిశీలన
- కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/కామారెడ్డి
‘బండి సంజరు ఒక బీసీ అయి ఉండి బీసీ రిజర్వేషన్కు అడ్డుపడుతున్నాడని, ఆయన బండారం బయటపెడతామని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈనెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేసేందుకు ఆదివారం జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలో ప్రధానమైన బీసీ డిక్లరేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. కేంద్రం బిల్లును పెండింగ్లో పెట్టినా.. దాన్ని అసెంబ్లీలో తీర్మానం ప్రకారం అమలు చేసి తీరుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న వివక్షతను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తా ఇంటింటికి వెళ్లి బీసీ డిక్లరేషన్పై వివరణ ఇచ్చి ఈ నెల 15న నిర్వహించే బీసీ డిక్లరేషన్ సమావేశానికి లక్షకు పైగా ప్రజలు వచ్చేవిధంగా చూడాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయగానే బీజేపీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా బండి సంజరుకు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. తనకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట రోడ్డుపై తిరుగుతానని, అతను కూడా తిరగాలని అన్నారు. తమ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటున్నామని, తాము ఓట్లు అడగడానికి వెళితే దేవుళ్ళ పేరు చెప్పబోమని, తాము చేసిన అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తామని తెలిపారు. కామారెడ్డి వేదికగా ప్రజలకిచ్చిన హమీని అమలు చేస్తున్నామని, అందుకే సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్య హాజరవుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకుంటుందన్నారు.
అనంతరం మంత్రులు కొండా సురేఖ, శ్రీహరి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపాలని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు కృషి చేస్తున్నాయని, వారిద్దరికీ బుద్ధి చెప్పాలంటే బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావాలన్నారు. అందుకు ప్రతి కార్యకర్త గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఏనుగు రవీందర్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, బీబీపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుతారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ డిక్లరేషన్ సభా స్థలం పరిశీలన..
ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ అమలు సభ ఏర్పాట్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమగమయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఐదుగురు మంత్రుల బృందం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వాకాటి శ్రీహరితో పాటు ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం, డిగ్రీ కళాశాల మైదానాలను పరిశీలించారు.
మంత్రుల కాన్వారులో అపశృతి
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న కాన్వారులోకి అడ్డంగా మధ్యలోకి మరో కారు వచ్చింది. దాన్ని తప్పించబోయి డివైడర్ తగిలి షబ్బీర్ అలీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం డ్యామేజయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
- Advertisement -