నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో నెలకొన్న మురికి కాలువల సమస్యను పరిష్కరించేందుకు స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. బైపాస్ రోడ్ రాం నగర్ కాలిని నుండి లింగయత్ స్మశాన వరకు, మొచి కాలిని, ఎస్సి కాలిని హౌజింగ్ బోర్డ్, ఇందిరా నగర్, బుడుగా జంగల గల్లీ ప్రాంతాలతో పాటు సోమలింగల వైపు వెళ్లే దారిలోని మురికి కాలువల పరిస్థితిని సర్పంచ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయితీ రాజ్ ఏఈ అరుణ్ , ఫీల్డ్ ఆఫీసర్ దేవిదాస్ గ్రామ కార్యదర్శి సందీప్, ఉప సర్పంచ్ రమేష్ తదితరులు ఆమెతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించారు.
ముఖ్యంగా మొచి కాలిని అలాగే బుడుగా జంగల ప్రాంతంలో మురికి కాలువల వల్ల దుర్గంధం వ్యాపిస్తూ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వీటివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో మద్నూర్ గ్రామంలో ప్రధానంగా ఉన్న మురికి కాలువల పారిశుద్ధ్య సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సర్పంచ్ ఉషా సంతోష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.



