నవంబర్ 18న ప్రమాణ స్వీకారం : తేజస్వీయాదవ్
ఎగ్జిట్పోల్స్లో సీఎం ఎవరంటే.. నితీశ్కు 22 శాతం, తేజస్వీకి 34 శాతం మద్దతు
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కౌన్బనేగా సీఎం అనే చర్చ నడుస్తుండడం, ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై మహాగట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ తోసిపుచ్చారు. తాను భ్రమల్లోనూ, అపార్థంలోనూ జీవించడం లేదని అన్నారు. ఎగ్జిట్ ఫలితాలపై బుధవారం పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న సాయంత్రం 6-7 అయినా ఓటు వేసేందుకు ప్రజలు క్యూల్లో నిలబడ్డారు. ఓటింగ్ ఇంకా జరుగుతుండగానే.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. మేం తప్పుడు ఆశావాదంలోనూ, అపార్థంలోనూ జీవించడం లేదు. ఈ సర్వేలు కేవలం మానసికంగా దెబ్బతీయడానికి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి బయటకొచ్చాయి” అని తేజస్వియాదవ్ అన్నారు.
”ఎన్నికలు ముగిసిన వెంటనే మహాగట్బంధన్ ప్రజాభిప్రాయాలను సేకరించింది. ఈ ఎన్నికలు 1995 ఫలితాల కంటే మెరుగాన్గే ఉండొచ్చు. బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎన్డీఏకి వ్యతిరేకంగానే ప్రజలు ఓటు వేశారు. మహాగట్బంధన్ గెలుస్తుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి. నవంబర్ 18న సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని నేను గతంలోనే చెప్పాను”.. అని తేజస్వీ పునరుద్ఘాటించారు. కాగా ఎగ్జిట్పోల్స్ బీహార్ సీఎం ఎవరు..అన్న దానిపై సీఎం నితీశ్కు కేవలం 22 శాతం మంది మద్దతిస్తే.. మహాగట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్కు ఏకంగా 32 శాతం మంది మద్దతిచ్చారని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ లెక్కన ఎగ్జిట్పోల్స్లో వాస్తవమెంత ? అనే దానిపై కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్టాపిక్గా మారింది.
మేమే గెలుస్తాం
- Advertisement -
- Advertisement -



