నవతెలంగాణ – హైదరాబాద్; రాజస్థాన్ రాయల్స్ను వీడాలని సంజూ శాంసన్ డిసైడ్ కావడంతో అతడిని ఏ ఫ్రాంఛైజీ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తొలుత సీఎస్కే.. ఆసక్తి చూపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తమ జట్టులోని ఆటగాళ్లను ఇచ్చేందుకు ఆ జట్టు సముఖంగా లేదు. దీంతో డీల్ కుదిరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం సంజూ శాంసన్ను దక్కించుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సంజూ శాంసన్ ప్లేసులో ఇతర ఆటగాళ్లను తీసుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేకేఆర్.. కొత్త ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ 2025లో నిలకడగా రాణించిన అంగ్రిష్ రఘువంశీ, ఆల్ రౌండర్ రమణ్దీప్ సింగ్లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేకేఆర్ చెప్పిందట. ఐపీఎల్ 2025 సీజన్లో రఘువంశీ రూ.3 కోట్లు, రమణ్దీప్ సింగ్ రూ.4 కోట్లు శాలరీ తీసుకున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ రూ.18 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. ఒకవేళ రఘువంశీ, రమణ్ దీప్ సింగ్లతో బదిలి చేస్తే రూ.7కోట్లు పోనూ.. మిగతా 11 కోట్లను కేకేఆర్.. రాజస్థాన్ రాయల్స్కు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ డీల్ సాధ్యమవుతుందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. కేకేఆర్ ఇచ్చిన ఆఫర్కు రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోవడం కష్టమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్ అవసరం ఉంది.