– తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని కోరింది. కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి. సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి ఆయా కేంద్రాల్లో వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. రైతు ధాన్యం అమ్మిన తర్వాత కూడా మిల్లులకు చేరే వరకు కాపలా కాయాల్సి వస్తుందని పేర్కొన్నారు. క్వింటాలుకు రెండు నుంచి నాలుగు కిలోల దాకా తరుగు తీస్తున్నారని పేర్కొన్నారు. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ధాన్యం కొన్న వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. మొక్కజొన్న, వరి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, కూరగాయలు, చెరుకు తదితర పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎకరాకు రూ.10వేల పంట నష్ట పరిహారమిస్తామన్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని కూడా ప్రారంభించలేదని గుర్తు చేశారు. యాసంగిలో దెబ్బతిన్న పంటల వివరాలకు సేకరించి, పూర్తి పరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES