Sunday, June 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆదాయానికి మించి ఏం చేయలేను..

ఆదాయానికి మించి ఏం చేయలేను..

- Advertisement -

– సహకరించాల్సిన వారే సమరమంటే ఎలా?
– పార్టీల కుట్రలో పావులుగా మారకండి
– మనమంతా కలిస్తేనే ప్రభుత్వం
– సమస్యలుంటే కూర్చుని చర్చించుకుందాం
– ఉద్యోగ సంఘాలనుద్దేశించి సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు
– ‘తెలంగాణ పోలీస్‌ రియల్‌ హీరోస్‌-2025’ అవార్డులందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తనను కోసినా ఆదాయానికి మించి ఏమీ చేయలేనని ఆయన వ్యాఖ్యానించారు. పదేండ్లపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిన వ్యక్తి ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో హాయిగా పడుకున్నారని మాజీ సీఎం కేసీఆర్‌నుద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు.. ఇక సమరమే అంటూ హెచ్చరిం చటం సరికాదని అన్నారు. ‘వారి సమరం ఎవరిపై? తెలంగాణ ప్రజలపైనా వారి యుద్ధం…?’ అని సీఎం ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘తెలంగాణ పోలీస్‌ రియల్‌ హీరోస్‌-2025’ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ సంఘాలనుద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకటో తారీఖున్నే జీతాలు ఇస్తున్నందుకు సమరానికి కాలు దువ్వుతున్నారా? అని ప్రశ్నించారు. జీతభత్యాల కోసం ప్రతీనెలా రూ.ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. గత పాలకులు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కింద ఇవ్వాల్సిన రూ.8,500 కోట్లను బకాయి పెట్టి వెళ్లారని వాపోయారు. ఆ విధంగా బకాయి పెట్టిన పార్టీలే, ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పదహారు నెలల కాలంలో రూ.30 వేల కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేశామని సీఎం గుర్తు చేశారు. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అని చెప్పి… ఆ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టి పోయిందని తెలిపారు. విద్యుదుత్పత్తి కోసం బొగ్గును కొనుగోలు చేసి, సింగరేణికి డబ్బులివ్వకుండా ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న వారు… కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలకు సీఎం సూచించారు. ‘సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకుందాం, కూర్చుని మాట్లాడుకుందాం…’ అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వమంటే తామొక్కరమే కాదనీ, అందరూ కలిస్తేనే ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ‘మనం పాలకులం కాదు, సేవకులం…మనం ఉన్నది సమరం చేయటానికి కాదు, ప్రజలకు సేవ చేయటానికి…’ అని సూచించారు. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లెవరూ బాగుపడిన దాఖలాల్లేవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర చాలనే రాజకీయ పార్టీల కుట్రలో పావులు కావద్దంటూ ఉద్యోగ సంఘాలు, వాటి నేతలకు ఆయన హితవు పలికారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు, సంఘాల నేతలు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక కుటుంబం లాంటిదనీ, అందువల్ల దాని పరువును బజారున పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగిం చొద్దని కోరారు. ఇప్పుడు సమరం కాదు.. సమయస్ఫూర్తి అవసరమని నొక్కి చెప్పారు.
స్వీయ నియంత్రణే పరిష్కారం…
అప్పులు తెచ్చైనా సరే.. సంక్షేమ పథకాలను అమలు చేద్దామంటే, కొత్త అప్పులు ఎక్కడా పుట్టటం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభు త్వానికి స్వీయ ఆర్థిక నియంత్రణ తప్ప వేరే మార్గం, పరిష్కారం లేదని అన్నారు.
పోలీసుల కుటుంబాలను ఆదుకుంటాం…
తెలంగాణ పోలీసులు నూటికి నూరు శాతం శాంతి భద్రతలను కాపాడుతున్నారని సీఎం ప్రశంసించారు. దేశ సరిహద్దుల్లో సైనికుల మాదిరిగా వారు రాష్ట్రాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. ఇక్కడ శాంతి భద్రతలు బాగుండటం వల్లే ప్రపంచస్థాయిలో పెట్టుబడులను మనం ఆకర్షించగలుగుతున్నామని వివరించారు. పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు, ఎస్పీ, అడిషనల్‌ ఎస్పీల కుటుంబాలకు రూ.కోటిన్నర పరిహారంగా అందిస్తున్నామని వెల్లడించారు. పోలీసుల పిల్లల భవిష్యత్‌ కోసం 50 ఎకరాల్లో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ప్రారంభించామని సీఎం గుర్తు చేశారు. వారికి మంచి భవిష్యత్‌ను అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసానిచ్చారు. ఈ సందర్భం గా పలువురు పోలీస్‌, ట్రాఫిక్‌ అధికారులకు ముఖ్యమంత్రి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌, పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -