Sunday, December 14, 2025
E-PAPER
Homeజాతీయంప్రజలకు ఏం ప్రయోజనం?

ప్రజలకు ఏం ప్రయోజనం?

- Advertisement -

‘ఉపాధి’ పేరు మార్పుపై ప్రియాంకాగాంధీ
కేంద్రం తీరుపై విమర్శలు


న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్‌ యోజన’గా మార్చటంపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయంపై ఆ పార్టీ ఎంపీ, అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ స్పందించారు. ఉపాధిహామీ చట్టం పేరు మార్చడంవల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏం టని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి పేరు మార్పు చర్యలతో డబ్బు ఖర్చు తప్ప మరే ఉపయోగం లేదని విమర్శించారు. వంద రోజులు ఉపాధి కల్పించడం ద్వారా పల్లెప్రాంత పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఎన్నో ఏండ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి ఇప్పుడు పేరు మార్చాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదన్నారు. పథకం పేరు మార్చితే.. దానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు, వస్తువులపై ఇప్పటికే ముద్రించిన పేర్లను మార్చాల్సి వస్తుందని ప్రియాంకాగాంధీ అన్నారు.

ఇది ఖరీదైన ప్రక్రియ అని, చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆమె చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్‌ యోజనగా మారుస్తూ శుక్రవారం కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. ఈ పథకంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. ఏటికేడు బడ్జెట్‌లో కోత విధిస్తున్నది. అనేక ఆంక్షలతో లబ్దిదారుల ప్రయోజనాలకు గండి కొడుతున్నది. కొత్త కొత్త షరతులతో పథకం అమలునే గందరగోళపరుస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -