ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవనన్న ఆర్టీసీ బస్సెక్కాడు.. ఆయన టిక్కెట్ ఛార్జీని మంత్రి నారా లోకేశ్ చెల్లించాడు. తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రాలోనూ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అక్కడి ప్రభుత్వం పంద్రాగస్టు రోజున ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ తదితరులు ఉండవల్లి నుంచి అమరావతి వరకు ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. పవన్ తన టిక్కెట్ డబ్బులను చెల్లించేందుకు సిద్ధపడగా.. వద్దన్నా, మీ అందరికీ నేనే టిక్కెట్ తీసుకుంటానంటూ లోకేశ్ డబ్బులు చెల్లించారు. ‘నేను మీకిప్పుడు టిక్కెట్ కొనిచ్చాను కాబట్టి, నా నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకుపోతా…’ అంటూ లోకేశ్ వ్యాఖ్యానించటంతో అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి. ఇదంతా బాగానే ఉందిగానీ, ఇక్కడ తెలంగాణలో గానీ, అక్కడ ఆంధ్రాలోగానీ వివిధ పథకాల కింద మహిళలు, వృద్ధులు, వితంతువులు, విద్యార్థులు, జర్నలిస్టులకు రాయితీ కింద ఇస్తున్న బస్పాస్లకు సంబంధించిన నిధులను రెండు గవర్నమెంట్లు చెల్లించటం లేదు. దీంతో ఆర్టీసీని మరింత ఆర్థిక కష్టాలు వెంటాతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా ఇదే తంతు నడుస్తోందని ఆర్టీసీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టాగయితే ‘బస్సు చక్రం ముందుకు కదిలేదెట్టా…’ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. నష్టాలను పూడ్చుకునేం దుకు దసరా, సంక్రాంతి, ఇతర పండుగ సీజన్లలో రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తే…’ఆర్టీసీ మా మీద భారాలేస్తోంది…’ అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. అందుకే… తెలంగాణలో రేవంతన్న, ఏపీలో చంద్రబాబన్న… జర ఈ విషయమై సోచాయించురి…
– బి.వి.యన్.పద్మరాజు
పవన్ టిక్కెట్ లోకేశ్ కొన్నవేళ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES