Friday, June 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పనులు పూర్తయ్యేదెప్పుడో?

పనులు పూర్తయ్యేదెప్పుడో?

- Advertisement -

భూసేకరణ, రోడ్లు, చెరువు పునరుద్ధరణకు రూ.350 కోట్లు
పరిహారంపై మౌనం..
మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పనుల్లో తీవ్ర జాప్యం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఇక పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్న తరుణంలో రైతులకు నష్టపరిహారంపై తుది నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండటం సందేహాలకు తావిస్తోంది. తాజాగా ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హన్మకొండ కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, వానాకాలం సాగు సన్నద్ధంతోపాటు మామునూరు ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ, పనులపై కూడా సమీక్షించాల్సి ఉంది. ఎ జెండాలోని అన్ని అంశాలను సమీక్షించిన మంత్రి మామునూరు ఎయిర్‌పోర్ట్‌ అంశాన్ని మాత్రం పక్కనపెట్టేశారు. దాంతో ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణలో మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ మౌనంగా ఉండటం గమనార్హం. కాగా, రైతుల దగ్గర నుంచి సేకరించే భూములకు రూ.1.20కోట్లు ఇచ్చేందుకు కలెక్టరేట్‌ సమీక్షలో నిర్ణయించినట్టు సమాచారం.
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు 949.14 ఎకరాలు అవసరం అయితే 696.14 ఎకరాలు ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పరిధిలో ఉంది. మరో 253 ఎకరాలను సేకరిస్తే పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్స్‌ నడిపే అవకాశముంటుంది. కాగా, దానికోసం సర్వేను ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి అధికారులు ఎకరాకు నిర్ణయించినట్టు సమాచారం. కాగా, ఖిలావరంగల్‌ మండలంలోని నక్కలపల్లి, గాడిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. నక్కలపల్లిలో 51.20 ఎకరాలు, గాడిపల్లిలో 197.20 ఎకరాలను సేకరించాల్సి ఉంది. 21.23 శిఖం భూములు అందుబాటులో ఉన్నాయి. నక్కలపల్లికి చెందిన 63 మంది రైతులు, గాడిపల్లికి చెందిన 252 మంది రైతులు మొత్తంగా 315 మంది రైతుల భూములను రెవెన్యూ అధికారులు సేకరించడానికి సర్వే నిర్వహించారు. రైతుల డిమాండ్‌ మేరకు తుది ధరను నిర్ణయించడంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. వ్యవసాయ భూములకు సంబంధించి నక్కలపల్లి గ్రామంలో రిజిస్ట్రర్‌ లెక్కల ప్రకారం ఎకరాకు 15.3 లక్షలు కాగా, గాడిపల్లిలో ఎకరాకు రూ.12.34 లక్షలుగా వుంది. జిల్లా కలెక్టర్‌ సత్యశారద పర్యవేక్షణలో వరంగల్‌ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు క్షేత్రస్థాయిలో ఎంజారుమెంట్‌ సర్వేను పూర్తి చేశారు.
ధరలపై గందరగోళం..
మామునూరు ఎయిర్‌పోర్ట్‌ భూ సేకరణలో నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 253 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారం విషయంలో తుది నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఈ ప్రాంతంలో ఉన్న ధరలను నిర్ణయించా లని రైతులు పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు సంబంధించి చట్టాల పరిధిలో వివిధ మార్గాలను రైతుల ముందుంచి పలు దఫాలుగా ధరలను నిర్ణయించినా నేటికీ కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు జనరల్‌ అవార్డు కింద ఎకరాకు రూ.1.20కోట్లుగా నిర్ణయించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. భూములను కోల్పోతున్న రైతులు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు. భూమికి బదులు భూమి ఇవ్వాలని తొలిదశలో డిమాండ్‌ చేసినా ప్రభుత్వం ఒప్పుకోలేదు. వందేండ్ల చరిత్ర కలిగిన గ్రామదేవతగా గ్రామస్తులు భావిస్తున్న చెట్టు రన్‌వేకు అడ్డంగా ఉండగా, దాన్ని తొలగించొద్దని గ్రామస్తులు కోరుతున్నారు. దాంతో ఈ వృక్షాన్ని తరలించడానికి రూ.10 లక్షలు ఖర్చు కానుంది. మామునూరు నుంచి గుంటూరుపల్లికి రహదారి రన్‌వేలో పోతుండటంతో ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించాలని గ్రామస్తులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -