కేసీఆర్ లక్ష ఇండ్లు కడితే.. రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లను కూల్చారు
షేక్పేట్ అంబేద్కర్నగర్ కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ ఉప్ప ఎన్నికలో ఎదురీతకు లేడీ నిల్చుంటే..? అటు దిక్కు రౌడీ నిల్చున్నాడని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. షేక్పేట్ అంబేద్కర్నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో శనివారం హరీశ్రావు మాట్లాడారు. హైదరాబాద్లో కేసీఆర్ లక్ష ఇండ్లు నిర్మిస్తే.. సీఎం రేవంత్రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టారన్నారు. మాగంటి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సతీమణికి టికెట్ ఇచ్చినట్టు తెలిపారు. సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్ షోలకు జూబ్లీహిల్స్ ప్రజలు రావడం లేదని, కొడంగల్ నుంచి జనాలను తరలిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రూ.2,500 హామీని కాంగెస్ విస్మరించిందని, బీఆర్ఎస్ను గెలిపిస్తే ఇస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్కు కర్రు కాల్చివాత పెట్టబోతున్నారన్నారు. ఇదే అంబేద్కర్నగర్లో హైడ్రా నోటీసులు ఇచ్చారని, అయినా కాంగ్రెస్కు ఓటేస్తే ఇండ్లు కూలగొట్టడానికి అనుకూలంగా ఉన్నట్టు సీఎం రేవంత్రెడ్డి అనుకుంటారని తెలిపారు.
జూబ్లీహిల్స్లో రేవంత్రెడ్డిని ఓడగొడితే మహబూబ్నగర్లోని అవ్వలకు రూ.4వేల పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితే రూ.2,500 వస్తాయని నల్లగొండ చెల్లి ఎదురు చూస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ను ఓడించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెసోళ్లు బోగస్ ఓట్లతో గెలవాలని చూస్తున్నారన్నారు. ఓటుకు రూ.5 వేలివ్వడం కాదు, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున రెండేండ్లకు ఒక్కో మహిళకు రూ.60 వేలు ఇవ్వాలన్నారు. ఈ ఒక్క సీటు గెలిస్తే పావుగంటలో వచ్చి బుల్డోజర్కి అడ్డంగా నిల్చుంటానని తెలిపారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ ఉండదు, కాంగ్రెస్ ఉండదన్నారు. ముస్లింలు కాంగ్రెస్ లేకపోతే లేరని అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.



