దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ నేడు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్
నవతెలంగాణ-గువహటి : ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశలో నిలకడగా రాణించిన నాలుగు జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. అగ్ర జట్టు ఆస్ట్రేలియా, ఆతిథ్య జట్టు భారత్ గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో తలపడనుండగా.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు నేడు తొలి సెమీఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్ పోరుకు గువహటి వేదిక కానుంది. ఇటు ఇంగ్లాండ్, అటు దక్షిణాఫ్రికా మంచి ఫామ్లో ఉన్నాయి. చివరి ఐదు వన్డేల్లో ఇరు జట్లు నాలుగు విజయాలు సాధించాయి. దీంతో నేడు తొలి సెమీఫైనల్ సమవుజ్జీల సమరంగా సాగనుంది. ఆమీ జోన్స్, టామీ బ్యూమోంట్, నటాలీ సీవర్, సోఫియా, సోఫి ఎకెల్స్టోన్లు ఇంగ్లాండ్కు కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికా ప్రధానంగా బ్రిట్స్, సునె లుస్, మారిజానె కాప్, నాన్కుల్లెకో, నదినె డిక్లెర్క్లపై ఆధారపడింది. గత రెండు వారాల్లో గువహటిలో మ్యాచులు జరుగలేదు. సెమీఫైనల్ మ్యాచ్కు తాజా పిచ్ను సిద్ధం చేశారు. సంప్రదాయంగా ఈ పిచ్ స్పిన్నర్లకు కాస్త మొగ్గు. వర్షం సూచనలు లేకపోయినా.. సెమీఫైనల్కు రిజర్వ్ డే అందుబాటులో ఉంది.



