నవతెలంగాణ నాచారం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిందో భార్య. శనివారం నాచారం పోలీస్ స్టేషన్ సీఐ ధనుంజయ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన నారాయణ బెహరా(32), బంధిత బెహరా(27) ఎనిమిదేండ్ల క్రితం పెండ్లి చేసుకున్నారు. వీరికి ఆరేండ్ల కుమార్తె ఉంది. ఓల్ట్మీర్పేట్ శాంతినగర్లో నివాసం ఉంటున్నారు. కాగా, నారాయణ బెహరా ప్లంబర్. బంధిత ఎన్ఏఫ్సీ కంపెనీలో స్వీపర్గా పనిచేస్తుంది. బిహార్కు చెందిన విద్యాసాగర్(25) మల్లాపూర్ శాంతినగర్లో ఉంటూ వెల్డర్గా పని చేస్తున్నాడు. బంధిత, విద్యాసాగర్ ఇండ్లు పక్కపక్కనే ఉండడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇందుకు అడ్డుగా ఉన్న భర్త నారాయణ బెహరాను హత్య చేయాలని ఇద్దరూ పథకం పన్నారు.
గురువారం రాత్రి నారాయణ, విద్యాసాగర్ కలిసి మల్లాపూర్లోని వైన్స్ వద్ద మద్యం తాగారు. అర్ధరాత్రి ఇంటికొచ్చిన నారాయణతో భార్య బంధిత పథకం ప్రకారమే గొడవ పడింది. అదే అదనుగా భావించిన బంధిత, తన ప్రియుడితో కలిసి ఇనుపరాడ్డుతో భర్తను తలపై కొట్టడంతో మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు 24గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. భర్తను ప్రియుడితో కలిసి చంపినట్టు బంధిత పోలీసులు ముందు నేరాన్ని అంగీకరించింది.



