నవతెలంగాణ హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలలు లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో రూ.90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం.. డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్రెడ్డి, కోదండరామ్, ఓయూ వీసీ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్రెడ్డి, ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారే. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా, ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయే. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియానే. యాదయ్య.. తెలంగాణ కోసం అమరులయ్యారు. ఈ వర్సిటీ ఐపీఎస్, ఐఏఎస్లను అందించింది. ఈ వర్సిటీకీ గొప్ప చరిత్ర ఉంది. వందేళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సుప్రీంకోర్టుకు వెళ్లి కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికను అడ్డుకున్నారు. మరో 15 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ అవుతారు. ఎవరు అడ్డుకుంటరో నేను చూస్తా. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు. ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయి. యువ నాయకత్వం దేశానికి అవసరం. దేశానికి అతిపెద్ద సంపద యువతే.
ఈ సారీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజీ వద్దే… ఒక్క పోలీసు కూడా ఉండోద్దు
విద్యార్థులకు నేను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమే. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. నేను సీఎం అయ్యాక సామాజిక బాధ్యతగా వర్సిటీలకు వీసీలను నియమించాను. చదువు ఒక్కటే అన్నింటికీ పరిష్కారం. ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. విద్యార్థుల కోసం పని చేయని వారిని వ్యతిరేకించండి. డిసెంబర్లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తా. అన్ని పనులు మంజూరు చేస్తా. ఒక్క పోలీసును కూడా క్యాంపస్లో ఉంచొద్దు. ఒక వేళ విద్యార్థులు నన్ను అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతా. ఉస్మానియా వర్సిటీని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధం. సకల వసతులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. అందుకోసం నిపుణులతో కమిటీ వేయండి. నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏఐ ద్వారా హెచ్సీయూలో ఏనుగులు, సింహాలను పెట్టారు. వాటిని మేం చంపుతున్నామని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రచారం చేశారు. మానవరూపంలో కొన్ని మృగాలు ఫాంహౌస్లో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలు వేయాలి. మళ్లీ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వస్తే ఉస్మానియా వర్సిటీని బతకనివ్వదు. ఓయూలో లేఅవుట్లతో ప్లాట్లు వేస్తారు. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించండి’’ అని సీఎం పిలుపునిచ్చారు.