15 రోజులు ఉభయ సభలు భేటీ
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
పని దినాల కుదింపుపై మండిపడ్డ ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ తేదీల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారని వెల్లడించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కిరణ్ రిజిజు పేర్కొన్నారు. అదేవిధంగా లోక్సభ సెక్రెటేరియట్ ప్రకటన విడుదల చేసింది. ‘భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో, ప్రజల ఆకాంక్షలకు ఉపయోగపడే నిర్మాణాత్మక-అర్థవంతమైన సమావేశాల కోసం ఎదురు చూస్తున్నా’ అని మంత్రి కిరణ్ రిజిజు పోస్టు చేశారు.
కాగా… మొత్తం 19 రోజులు సాగే ఈ సమావేశాల్లో 15 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. అలాగే ఈ సెషన్లో కీలకమైన రాజ్యాంగ (130వ) సవరణ బిల్లు-2025, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పున: వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, ఇతర బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. గతంలో శీతాకాల సమావేశాలు సాధారంగా నవంబర్ మూడో వారంలో మొదలై, క్రిస్మస్(డిసెంబర్ 25)కు ముందు ముగిసేవి. గతేడాది సైతం నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20కి ముగిశాయి. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత జరగనున్న ఈ సమావేశాలు చాలా కీలకం కానున్నాయి. దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(ఎస్ఐఆర్), హర్యానా, మహారాష్ట్రలలో జరిగిన ఓట్ల చోరీ పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
మోడీ టీంకు పార్లమెంట్ ఫోబియా పట్టుకుంది : ప్రతిపక్షాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల పని దినాలు తగ్గించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోడీ టీంకు ‘పార్లమెంట్ ఫోబియా’ పట్టుకుందని టీఎంసీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నేత డెరెక్ ఒబ్రాయిన్ అన్నారు. ‘మోడీ, ఆయన సహచర మంత్రివర్గ బృందం పార్లమెంట్ ఫోబియా అనే తీవ్రమైన మానసిక పరిస్థితితో బాధపడుతుంది. ఇది పార్లమెంట్ను నడపలేని భయం. ఈ నిర్ణయం మోడీ ప్రభుత్వంపై సందేహాలను సష్టిస్తోంది’ అని అన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (కమ్యూనికేషన్), రాజ్యసభ పార్టీ చీఫ్ విప్ జైరాం రమేశ్ కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘ఇది అసాధారణమైన నిర్ణయం. ఈ షార్ట్ సెషన్తో ఏ సందేశం ఇవ్వాలను కుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి బిల్లుల సవిరమైన చర్చ, ఆమోదం, సభ సజావుగా నిర్వహించాలనే ఆలోచన లేదు’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు.



