సమస్యల సుడిగుండాన్ని దాటేందుకు పోరాటమే మార్గం
అణచివేతపై ధిక్కార స్వరం వినిపించండి
పిలుపునిచ్చిన ఓల్గా చరిత్ర స్వరాల పుస్తకం పాత్రదారులు
తన వ్యాఖ్యానంతో రక్తి కట్టించిన అక్కినేని కుటుంబరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘ఓ మహిళ్లారా సమాజంలో అణిచివేత పెరుగుతున్నా పట్టదా? పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను భరిస్తూ ఇంకెంత కాలం గమ్ముగుంటారు? ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో పనిభారం… మరోవైపు ఇంటాబయటా చిన్నచూపు. ఇంకెంత కాలం భరిస్తారు? అణిచివేతనపై ధిక్కార స్వరం వినిపించండి. సమస్యల సుడిగుండాన్ని చేధించేందుకు పోరాటమే మార్గం. లెండి…కదలి రండి. ప్రజలకు మేలు చేసేందుకు పోరుబాట పట్టండి..పోరాటయోధుల్లా, వీరవనితల్లా మాలా చరిత్ర పుటలకెక్కండి’ అంటూ కందుకూరు రాజ్యలక్ష్మమ్మ, బెంగుళూరు నాగరత్నమ్మ, చిట్యాల ఐలమ్మ, దుర్గాభాయ్ దేశ్ముఖ్, కొమర్రాజు అచ్చమాంబ, కొమ్మూరి పద్వావతీదేవి, సారా పోరాటమ్మ పాత్రధారులు డాక్టర్ సి.మృణాలిని, సమ్మెట ఉమాదేవి, డాక్టర్ సలీమ, ఓల్గా, వేమన వసంతలక్ష్మి, పి.ప్రమీల, సహజ పిలుపునిచ్చారు.
మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లోని లామకాన్లో ఓల్గా రచించిన ‘చరిత్ర స్వరాలు’ పుస్తకంలోని వీరవనిత పాత్రలను ప్రదర్శించారు. వారు ఆయా పాత్రల్లో లీనమైపోయారు. ఆనాటి సామాజిక పరిస్థితులను ధిక్కరించి హక్కుల కోసం వీరవనితల్లా వారు ఏవిధంగా పోరాటం చేశారో కండ్లకు కట్టినట్టు వినిపించారు. ఈ పరిస్థితుల్లో తాము ఎలా పోరాటం చేసేవారమో చెబుతూ సభికులను చైతన్యపర్చారు. సినీరచయిత, డైరెక్టర్ అక్కినేని కుటుంబరావు తనదైన వాఖ్యాన్యంతో రక్తికట్టిస్తూ సభికులను అలరింపజేశారు.



