నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ఎంపీ ఆర్ సుధా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో మహిళలకు రక్షణ లేదని ఎంపీ ఆర్.సుధా అన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన సామాన్య జనాల పరిస్థితేంటని ఢిల్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నా.. స్త్రీలకు రక్షణ లేదని మండిపడ్డారు. దేశ రాజధానిలో భద్రత, రక్షణ ఎక్కడ ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళ సీఎంగా ఉన్నా ఢిల్లీలో స్త్రీలకు రక్షణ కరువైందని ఆమె విమర్శించారు. తన మెడలో చైన్ లాక్కెళ్లిన సమయంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సమాచారమిచ్చిన ఎలాంటి స్పందన లేకుండా అలాగే నిలబడి ఉండిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన ఫోన్ నెంబర్, తన వివరాలు తీసుకొని అంతటితో సరిపెట్టారని వివరించారు. “అతను నా గొలుసు లాగి నా బట్టలు చింపేశాడు. నేను నా బట్టలు సరిచేసుకోవాలనుకున్నాను, అందుకే నా గొలుసు గురించి నేను బాధపడలేదు. లాక్కున్న తర్వాత, అతను వెంటనే వెళ్లిపోయాడని మీడియాకు తెలిపారు.
కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యురాలు సుధా రామకృష్ణన్ దిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని చైన్ కొట్టేశారని ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకే నాయకురాలు రజతితో కలిసి చాణక్యపురిలోని పోలండ్ ఎంబసీ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.