Thursday, June 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువ్యవసాయ ఉత్పత్తిలో మహిళా కూలీలదే కీలక పాత్ర

వ్యవసాయ ఉత్పత్తిలో మహిళా కూలీలదే కీలక పాత్ర

- Advertisement -

– బీజేపీ పాలనలో మహిళలపై వేధింపులు పెరిగాయి
– మనువాద కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం
– మహిళా కూలీలు, రూరల్‌ వర్కర్స్‌ జాతీయ ముగింపు సదస్సులో విజయరాఘవన్‌, బి.వెంకట్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయ రంగ ఉత్పత్తిలో నేటికీ మహిళా కూలీలదే కీలక పాత్ర అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్య్లూయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్‌, బి. వెంకట్‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు, హత్యలు, లైంగికదాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను కప్పిపుచ్చేందుకు మనువాద కార్పొరేట్‌ విధానాలను ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళా కూలీలను సంఘటితం చేసి పెద్ద ఎత్తున పోరాటాలని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం కేరళ రాష్ట్రంలోని మల్లాపురం జిల్లా కేంద్రంలో అఖిలభారత మహిళా కూలీలు, రూరల్‌ వర్కర్స్‌ అఖిల భారత సదస్సు ముగిసింది. దీనికి అఖిల భారత నాయకులు కమలకుమారి అధ్యక్షత వహించారు. సదస్సు ముగింపు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలపై లైంగిక హింస పెరిగిందన్నారు. లైంగికదాడికి పాల్పడిన నిందితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహిళలపై దాడులను నియంత్రించటంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వలస కూలీలకు సామాజిక భద్రత లేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులను బీజేపీ ప్రభుత్వం ఎత్తి వేయాలనే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఆహార భద్రతను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. కోట్లాది మంది ప్రజలు తిండికి లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులను అందించాలనీ, భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములను పంచాలనీ, ఇండ్ల స్థలాలు పేదలకు ఇచ్చి ప్రభుత్వమే ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్‌, ఐద్వా నాయకులు సుజాత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగంతోపాటు కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపు అవుతున్నాయని చెప్పారు. ధరలపై నియంత్రణ లేకపోవడంతో పేదలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారని తెలిపారు. పనులు దొరకపోవడంతో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని గుర్తు చేశారు. ముగింపు సదస్సులో రాజ్యసభ సభ్యులు శివ దాసన్‌, జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు
– వ్యవసాయం, గ్రామీణ మహిళా కార్మికులకు సమాన పని కోసం సమాన జీతాన్ని నిర్ధారించాలి. అసమానతలేని ఉపాధి అవకాశాలను, మహిళల నైపుణ్యానికి తగిన పనిని, పురుషులతో సమానంగా జీతం చెల్లించాలి.
– రుణాల కోసం మైక్రోఫైనాన్స్‌ వ్యవస్థ సులభంగా అందుబాటులో ఉండేలా, వడ్డీ లేని రుణాలు అందించే సమర్థవంతమైన మైక్రోఫైనాన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
– వ్యవసాయ మరియు గ్రామీణ మహిళా కార్మికుల కోసం మాతృత్వ ప్రయోజనాలకు హామీ ఇచ్చే చట్టాన్ని తీసుకురావాలి. దీని అమలు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.
– పురుగుమందులు, రసాయనాలు, హెర్బిసైడ్లతో పని చేసే మహిళా కార్మికులకు రక్షణ కవచాలు (ప్రొటెక్టివ్‌ గియర్‌) ప్రభుత్వం ద్వారా అందించాలి.
– మహిళా కార్మికులకు భూమిపై హక్కును కల్పించాలి. తగిన నివాస వసతి కూడా అందించాలి.
– పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు (క్రెచ్‌లు) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
– మహిళల భాగస్వామ్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించాలి.
– 2013 లో రూపొందించిన ‘కార్యస్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం’ను కఠినంగా అమలు చేయాలి. త్వరిత న్యాయం కోసం ప్రత్యేక కోర్టులు, పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
– వలస మహిళా కార్మికులకు పని ప్రదేశాల్లో, నివాస ప్రాంతాల్లో గృహ, పారిశుద్ధ్యం, సామాజిక భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి.
– మహిళా వ్యవసాయ మరియు గ్రామీణ కార్మికుల ఆరోగ్య అవసరాలకు తగిన విధంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి.
– మహిళా వ్యవసాయ మరియు గ్రామీణ కార్మికులకు పెన్షన్‌లు, బీమా, సంక్షేమ పథకాలు ద్వారా సంపూర్ణ సామాజిక, ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -