నవతెలంగాణ-హైదరాబాద్: పని గంటల పెంపు బిల్లును ఉపసంహరించుకోవాలని సీఐటీయు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని గంటలు పెంచుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెడతామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి ప్రకటించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడమంటే బిల్లును ప్రవేశపెట్టి తమ మందబలంతో ఆమోదింపజేసుకుంటామని చెప్పటం మినహా మరొకటి కాబోదని పేర్కొన్నారు. అంతకు ముందు మంత్రివర్గం ఆమోదం పొందిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా రద్దు చేయాలని కోరారు. కార్మికులు ఎక్కువ సెలవులు పొందే విధంగా ఈ సవరణలు చేస్తున్నామని చెప్పటం కార్మికులను మోసగించటానికేనని తెలిపారు. కర్ణాటక బిజెపి ప్రభుత్వం మొదటగా 2023లో ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు చేసి పని గంటలు రోజుకు 12 గంటలు చేసిందని పేర్కొన్నారు. వారానికి 48 గంటల పని కొనసాగుతుందని, వారంలోపే 48 గంటలు పూర్తయితే మిగతా రోజులు వేతనంతో కూడిన సెలవు దినాలుగా పరిగణించబడతాయని చెప్పిందని తెలిపారు.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. గుజరాత్ బిజెపి ప్రభుత్వం 2025 జులైలో 12 గంటల పని దినం బిల్లు పాస్ చేసిందని తెలిపారు. అలాగే కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించకుండా బిల్లు పెట్టేందుకు సిద్ధమవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. కార్మిక సంఘాలతో ముందు చర్చించాలని, అక్కడ వచ్చిన ఏకాభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు. ప్రపంచమంతా ఆమోదించిన 8 గంటల పని, 8 గంటలు కుటుంబం, సామాజిక కార్యక్రమాలు 8 గంటలు విశ్రాంతి పద్ధతిని మార్పు చేయటాన్ని వ్యతిరేకించాలని కార్మికులను కోరారు.