నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 10 గంటల పనివిధానానికి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 282ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటరమేశ్, అనగంటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. లేబర్కోడ్లతో మోడీ సర్కారు కార్మికుల హక్కుల కాలరాసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దానికి సపోర్టు చేస్తూ రాష్ట్ర సర్కారు కూడా పనిగంటలను పెంచడాన్ని తప్పుబట్టారు. కార్మికుల శ్రమను దోపిడీ చేసి కార్పొరేట్లకు మేలు చేసేవిధంగా రాష్ట్ర సర్కారు నిర్ణయం ఉందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేరైనా పాలక వర్గాల విధానాలు ఒక్కటేనని మరోమారు రుజువైందని తెలిపారు. ఇప్పటి వరకు 24 గంటలు పనిచేసే సంస్థల్లో మూడు షిఫ్టుల పనివిధానం అమల్లో ఉందనీ, ఇప్పుడు కంపెనీలు ఆ విధానానికి స్వస్తి చెప్పి, అవే వేతనాలతో రెండు షిఫ్టుల్లో పని చేయించుకుంటాయని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పరిశ్రమల్లో ఒక షిఫ్ట్ కార్మికులకు పనిలేకుండా పోతుందనీ, దీంతో దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వెలిబుచ్చారు. బీజేపీ విధానాలపై పోరాడుతున్నామని గొప్పలు చెప్పే రాష్ట్ర సర్కారు..రాష్ట్రంలో వాటినే అమలు చేయాలని చూడటం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పని గంటల పెంపు జీవో 282ను ఉపసంహరించుకుని కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో కాంగ్రెస్ నేతలు కలిసి రావాలని కోరారు.
పనిగంటల పెంపు జీవోను ఉపసంహరించుకోవాలి : డీవైఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES