– ఉచిత ఆహార పంపిణీ, నగదు బదిలీ, సంక్షేమ పథకాలు కారణమంటూ వితండవాదం
– విభేదిస్తున్న ఆర్థికవేత్తలు…వృద్ధి లేకుండా ఎలా సాధ్యమంటూ ప్రశ్నలు
– ఇప్పటికీ టెండూల్కర్ దారిద్య్రరేఖను పట్టుకొని వేళ్లాడుతున్న పాలకులు
దేశంలో పేదరికం తగ్గిపోతోందా? ఏప్రిల్లో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన పేదరిక అంచనాలను చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. పది సంవత్సరాల క్రితం దేశంలో 23 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికంతో బాధపడితే ఇప్పుడు ఆ సంఖ్య 3.3 కోట్లకు తగ్గిపోయిందని ప్రపంచబ్యాంక్ చెబుతోంది. బ్యాంక్ అంచనాల ప్రకారం భారతదేశంలో 17.1 కోట్ల మంది పేదరికం నుంచిబయటపడ్డారు. దిగువ, మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడంతో వారి పేదరిక స్థాయి 61.8 శాతం నుంచి 28.1 శాతానికి తగ్గింది. ఫలితంగా ఆయా వర్గాలకు చెందిన 37.8 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. కాగా ఇవి తప్పుడు లెక్కలని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. వృద్ధి లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ : 2022-23 సంవత్సరపు గృహ వినియోగ వ్యయ సర్వే కూడా ప్రపంచబ్యాంక్ అంచనాలకు తగినట్టుగానే ఉంది. ఈ సర్వే 2.8 కోట్లు, ఏడు కోట్లకు మధ్యలో ఉన్న పేదరిక రేటును పరిగణనలోకి తీసుకుంది. 2011లో రూపొందించిన అధికారిక పేదరిక అంచనా ప్రకారం దేశంలోని 26 కోట్ల మంది ప్రజలు (జనాభాలో 21.9 శాతం) అత్యంత పేదలుగా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే ప్రపంచబ్యాంక్ అంచనాలు 2020 నాటి ఐఎంఎఫ్ కార్యాచరణ పత్రానికి కూడా అనుగుణంగానే ఉన్నాయి. ఈ పత్రాన్ని ఆర్థికవేత్తలు డాక్టర్ సుర్జిత్ భల్లా, కరణ్ భాసిన్, అరవింద్ విర్మానీ రూపొందించారు. ఈ పత్రం పేదరిక రేటును 2.5 శాతంగా అంచనా వేసి అటు ప్రశంసలను, ఇటు విమర్శలను అందుకుంది.
వృద్ధి లేకుండా ఎలా సాధ్యం?
ప్రపంచబ్యాంక్ అంచనాల ప్రకారం 2011-12లో దేశంలో అత్యంత పేదలైన వారిలో 65 శాతం మంది అత్యధిక జనాభా కలిగిన ఐదు రాష్ట్రాలు…ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనే ఉండగా 2022-23 నాటికి అది బాగా తగ్గిపోయింది. అయితే పేదరికం బాగా తగ్గిపోయిందంటూ ప్రపంచబ్యాంక్ వేసిన అంచనాలను చాలా మంది విశ్వసించడం లేదు. ప్రజలు నమ్మని లేదా అంగీకరించని విషయాలను వాస్తవాలుగా చెప్పడంలో అర్థం లేదని పలువురు వాదిస్తున్నారు. దేశంలో అభివృద్ది కనిపించనప్పుడు పేదరికం ఎలా తగ్గిందన్నది వారి ప్రశ్న. అభివృద్ధి లేకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. వాస్తవానికి ప్రపంచబ్యాంక్ చెబుతున్నట్లు పేదల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కన్పించడం లేదు. ఎందుకంటే వారి జీవనోపాధిని మెరుగుపరచే వృద్ధి అవకాశాలను ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఆహార ధాన్యాల పంపిణీ, నగదు బదిలీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే పేదరికాన్ని తగ్గించలేవు.
వీటితోనే పేదరికం సమసిపోతుందా?
ప్రపంచబ్యాంక్ ఏం చెప్పింది? దిగువ, మధ్య తరగతి ప్రజల్లో పేదరికం తగ్గిందట. గ్రామీణ, పట్టణ పేదరిక అంతరాలు తగ్గిపోయాయట. ప్రభుత్వం కూడా అనేక సమర్ధవంతమైన ప్రయత్నాలు చేసిందట. ఉచిత, సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం వల్ల పేదరికం తగ్గిందట. సంక్షేమ పథకాలు, ఆర్థిక సంస్కరణలు, అత్యవసర సేవలు అందించడంతో పేదరిక స్థాయిలు బాగా తగ్గాయట. అంటే దీని అర్థమేమిటి? రోజుకు 2.15 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని అత్యంత నిరుపేదలుగా అంతర్జాతీయ పేదరిక ప్రమాణం పరిగణిస్తోంది. అలాంటి వారికి ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసినప్పుడు, నగదు బదిలీలు జరిపినప్పుడు వారి ఆదాయం పెరుగుతుందని, అప్పుడు వారు పేదరికం నుండి బయటపడినట్లేనని ప్రపంచబ్యాంక్ ప్రవచిస్తోంది. 2022లో ప్రపంచబ్యాంక్ వేసిన అంచనాల ప్రకారం…2021 కోవిడ్ సంవత్సరంలో దేశంలో పేదరిక రేటు 11.9 శాతంగా ఉంది. ఒకవేళ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించినప్పటికీ పేదరికం అది చెబుతున్న విధంగా తగ్గదు. వాస్తవానికి కొన్ని ప్రైవేటు అంచనాల ప్రకారం దేశంలో పేదరిక రేటు అధికంగా ఉంది.
రంగరాజన్ సిఫార్సులకు ‘నో’
ప్రపంచబ్యాంక్ తాజా అంచనాలను పరిశీలిస్తున్న ఆర్థిక నిపుణులు అధిక దారిద్య్రరేఖ కోసం పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెండూల్కర్ దారిద్య్రరేఖ ప్రకారం నగరాలలో నెలకు వెయ్యి రూపాయలు లేదా రోజుకు 33 రూపాయలు లేదా అంతకంటే తక్కువ సంపాదిస్తూ జీవిస్తున్న వ్యక్తిని, అలాగే గ్రామాలలో నెలకు రూ.816 లేదా రోజుకు రూ.27 లేదా అంతకంటే తక్కువ సంపాదనతో బతుకు ఈడుస్తున్న వ్యక్తిని పేదవాడిగా పరిగణిస్తున్నారు. ఇది ప్రపంచబ్యాంక్ యొక్క తీవ్ర పేదరిక కొలత (రోజుకు 2.15 డాలర్ల సంపాదన)కు దగ్గరగా ఉంది.
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు టెండూల్కర్ అంచనాలు తగినట్లుగా లేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డాక్టర్ సి.రంగరాజన్ నేతృత్వంలో మరో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం 2014లో తన సూచనలు అందజేసింది. దీని ప్రకారం పట్టణ ప్రాంతంలో నెలకు రూ.1,407 (రోజుకు రూ.47), గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.972 (రోజుకు రూ.33) జీతం పొందే వారిని పేదలుగా పరిగణించాల్సి ఉంది. అయితే దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. కాబట్టి 2009లో ఆమోదించిన టెండూల్కర్ దారిద్య్రరేఖనే ఇప్పటికీ పరిగణనలోకి తీసుకుంటున్నాము.
ప్రపంచబ్యాంక్ పెదవి విరుపు
తాజా వినియోగ వ్యయ సర్వే కూడా కుటుంబ వ్యయంలో వచ్చిన మార్పులను ధృవీకరిస్తూ దారిద్య్రరేఖను మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. 2021-22 నుండి ఉపాధి వృద్ధిలో వచ్చిన మార్పులు ఈ వాదనను మరింత బలపరుస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఉపాధి వృద్ధి రేట్లు పెరుగుతున్నాయి. అయితే భారత్ నిజంగా పేదరిక విభజనను అధిగమించిందా అనే ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఈ దశాబ్దంలో మనం మరింత మందిని పేదరికం నుండి బయటపడేయగలమా అన్నదే ఇక్కడ ప్రధానమైన అంశం. ప్రపంచ పేదరిక నిర్మూలన దాదాపు నిలిచిపోయిందని గత అక్టోబరులో ప్రపంచబ్యాంక్ గుర్తించింది. 2020-30 మధ్య పేదరిక నిర్మూలన విషయంలో ఏ మాత్రం పురోగతి కన్పించడం లేదు. ఈ విషయంలో ప్రస్తుతం సాధిస్తున్న పురోగతిని చూస్తుంటే తీవ్ర పేదరికాన్ని పారద్రోలడానికి దశాబ్దాలు పడుతుంది. అలాగే ప్రజల దినసరి ఆదాయాన్ని 6.85 డాలర్ల కంటే పెంచడానికి శతాబ్ద కాలం పడుతుందని ప్రపంచబ్యాంక్ చెబుతోంది.
ఇవీ లెక్కలు…
ప్రపంచబ్యాంక్ అంచనాల ప్రకారం 2011-12లో 16.2 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 2.3 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాలలో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం 7.7 శాతం పాయింట్ల నుంచి 1.7 శాతం పాయింట్లకు తగ్గిపోయింది. దీనిని బట్టి ఒక దశాబ్ద కాలంలో వార్షిక తగ్గుదల రేటు 16 శాతంగా నమోదైంది. దిగువ, మధ్య తరగతి ప్రజల ఆదాయ స్థాయిలో పేదరిక రేటు 61.8 శాతం నుంచి 28.1 శాతానికి తగ్గిందని ప్రపంచబ్యాంక్ అంచనా. అంటే గ్రామీణ పేదరికం 69 శాతం నుంచి 32.5 శాతానికి, పట్టణ పేదరికం 43.5 శాతం నుంచి 17.2 శాతానికి తగ్గిందన్న మాట. అంతరం 25 నుంచి 15 శాతం పాయింట్లకు పడిపోయింది.