నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ సహా జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణలో గత 4-5 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో 6.6 సెంమీ వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, వరంగల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షాలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.