నవతెలంగాణ – హైదరాబాద్: నిన్నటితో సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తయిన సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తన సినీ జీవితాన్ని అనేక వినూత్న పాత్రలతో, సామాజిక స్పృహ కలిగిన చిత్రాలను ప్రజలకు అత్యంత చేరువ చేయడాన్ని చంద్రబాబు ప్రశంసించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనే కాదు, ఆయన సినిమాలు కూడా సమాజంపై ప్రభావం చూపించాయి. ఆయన్ని చూసి లక్షల మంది స్పూర్తి పొందారు” అంటూ చంద్రబాబు తన ట్వీట్లో రాసుకొచ్చారు.
ఇక, తనకు విషెస్ చెబుతూ చంద్రబాబు చేసిన ట్వీట్పై రజనీ స్పందించారు. మీ మాటలు నా మనసును తాకాయి, మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు న్యవాదాలు అంటూ సూపర్ స్టార్ రిప్లై ఇచ్చారు. “గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నా మనసును తాకాయి. నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. మీ ప్రేమ, మద్ధతులతో నేను ఇంకా బాగా పని చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాను. మీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు ” అని రజనీ ట్వీట్ చేశారు. అటు, ప్రధాని మోడీ కూడా సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ పోస్టు పెట్టారు. “రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతమైంది. ఆయనే కాకుండా, ఆయన పోషించిన పాత్రలు కూడా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇటువంటి చరిత్రాత్మక సినీ జీవితం, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన రజినీకాంత్ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు. దీంతో తనకు విషెస్ చెప్పిన మోదీకి కూడా రజనీకాంత్ థాంక్స్ చెప్పారు.