నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

నవతెలంగాణ – అమరావతి
ఐటీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్‌ సోమవారం సీఐడీ విచారణకు హాజరవుతున్నారు. సీఎం జగన్‌ భార్య వైఎస్‌ భారతి లక్ష్యంగా సోషల్‌ మీడియాలో ఒక పోస్టు గత ఏడాది సెప్టెంబరులో వైరల్‌ అయింది. ఐటీడీపీ ద్వారా సర్క్యులేట్‌ చేశారంటూ సీఐడీ అధికారులు… ఐపీసీ 419, 469, 153ఏ, 505(2), 120-బి, రెడ్‌ విత్‌ 34, 66(సి)తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 2000 కింద గత ఏడాది అక్టోబరు 1న ఎఫ్‌ఐఆర్‌ 14/2022 నమోదు చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ రోడ్‌ నంబరు 3లోని చింతకాయల విజయ్‌ ఇంటికెళ్లి గాంధీ జయంతి ముందు రోజు హల్‌చల్‌ చేశారు. 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలిచారు. కోర్టులో స్టే తెచ్చుకున్న విజయ్‌ ఈ నెల 27న హాజరవ్వాల్సి ఉంది. ఆ రోజు హాజరు కాలేనంటూ మరోమారు ఆయన కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అనుమతితో సోమవారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు విజయ్‌ హాజరవుతున్నారు.

Spread the love