మనుస్మృతి ఆధార గ్రంథావిష్కరణను నిలిపివేయాలి

– లేనియెడల కార్యక్రమాన్ని అడ్డుకుంటాం
– ఓబీసీ,ఎస్సీ,ఎస్టీ,విద్యార్థి ప్రజాసంఘాలు డిమాండ్‌
నవతెలంగాణ-ఓయూ
మనిషిని మనిషిగా చూడడానికి నిరాకరించిన మనుస్మృతి ఆధార గ్రంథాన్ని ప్రాచీన భారత రాజ్యాంగం- శిక్షాస్మతి పేరుతో ఈ నెల 15న నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ కాలేజ్‌లో జరిగే అవిష్కరణను ఉపసంహరించుకోవాలని బహుజన్‌ ముక్తి పార్టీ, డి.బి.ఎఫ్‌., బి.వి.యం, ఎల్‌.ఎచ్‌.పి.ఎస్‌, వై. హెచ్‌.పి. యస్‌, నప్ప్‌ , బహుజన క్రాంతి మోర్చా సంఘాల డిమాండ్‌ చేశాయి. పుస్తకవిష్కరణను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం వివిధ సంఘాలు తార్నాకలో నిర్వహించిన సమావేశంలో బహుజన్‌ ముక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంసోల్‌ లక్ష్మణ్‌, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్‌ బట్టు, ఎన్‌ఏపీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావేల్‌ గంగాధర్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ జాతీయ అద్యక్షులు దాస్‌ రాం నాయక్‌, బహుజన్‌ కముక్తి మోర్చా రాష్ట్ర అద్యక్షులు వలిగి ప్రభాకర్‌, ఐఎల్‌పీఏ న్యాయవాది లక్ష్మీదేవి, బీఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. నరేందర్‌ పవార్‌లు మాట్లాడారు. ఆర్య వీర్‌ దళ్‌, సమరతసమతా వేదిక ఆధ్వర్యంలో సమతా మూర్తుల ప్రేరణ సభ ముసుగులో జరుగుతున్న మనుస్మృతి అధర్మశాస్త్రాన్ని ప్రాచీన రాజ్యాంగం- శిక్షాస్మృతిగా గ్రంథావిష్కరణ చేయడం అప్రజాస్వామ్యనియమన్నారు. ప్రాచీన రాజ్యాంగం అని చెబుతూ మనుస్మృతి అవిష్కరిస్తున్నారంటే భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ యావత్‌ మూలనివాసి ప్రజానీకాన్ని మళ్లీ బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేసి అవమానపరు స్తున్నారన్నారు. నిత్యం అంబెడ్కర్‌ను అవమనిస్తూ కటకటాల పాలైన హమారా ప్రసాద్‌కు తొలి ప్రతిని ఇవ్వ డాన్ని చూస్తుంటే యావత్‌ తెలంగాణలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి ప్రజల మధ్య విభేదాలను పెంచి పోషించే కుట్ర జరుగుతోందన్నారు. ఆ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో అసమానతలను సృష్టించి శూద్రులైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను బానిసలుగా చేసే కుట్రను చేస్తున్నా రన్నారు. హైదరాబాద్‌ పోలీసులు ఈ పుస్తకవిష్కరణను నిలిపివేసి శాంతి భద్ర తలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేని యెడల పుస్తకా విష్కరణను అడ్డుకుంటామని అలాగే జరగబోయే పరిణా మాలకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరించారు. ఈ సమా వేశంలో బి.వి.ఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్‌, ఎల్‌.ఎచ్‌.పి.ఎస్‌ నాయకులు భద్రు నాయక్‌, డి.బి.ఎఫ్‌ రాష్ట్ర నాయకులు పులి కల్పన, న్యాయవాది సుమలత, విద్యార్థి సంఘాల నాయకులు భూంపల్లి రవి, నరేష్‌, యశ్వంత్‌, సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love