నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది ఈ ఘటనలో స్కూల్ బస్సులోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, విజ్ఞాన్ స్కూల్కు చెందిన బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు వేగంగా ఢీ కొట్టడంతో స్కూల్ బస్సులోని పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. హాహాకారాలు చేశారు. విషయం తెలిసిన వెంటనే తమ పిల్లలకు ఏమైందనే భయంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. పిల్లలకు తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైదరాబాద్కు తరలించాలని సూచించారు.