– రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల
– రూ.1.5 లక్షల్లోపు రుణాలున్న 6.40 లక్షల రైతులకు లబ్ది
– అసెంబ్లీ నుంచే ఖాతాల్లో జమ
– రైతుల్లో సంతోషంతో నా జన్మ ధన్యమైంది : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశానికి ఆగస్టు నెలలోనే స్వాతంత్య్రం వచ్చిందనీ, ఈ ఏడాది ఆగస్టులోపే తెలంగాణ లోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. ఈ జులై, ఆగస్టు నెలలు దేశ చరిత్రలోనే లిఖించదగ్గ నెలలని అభివర్ణించారు. కేవలం 12 రోజుల్లో రూ.12 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమదేనని అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరనీ, తమ ప్రభుత్వ ప్రణాళికలను ఎవరూ ప్రశ్నించలేరంటూ సవాల్ చేశారు. ఏకకాలంలో రూ.31 వేల కోట్లు కేటాయించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే కొత్త రికార్డు అని గుర్తు చేశారు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని తెలియజేశారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీల నేతలకు రైతులు గుర్తుకు వస్తారని సీఎం అన్నారు. కానీ ఇప్పుడేం ఎన్నికలు, ఓట్లు లేవన్నారు. తమకు రాజకీయ ప్రయోజనాలు కాదనీ, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతు రుణమాఫీ రెండో విడుత నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కౌన్సిల్ ఛైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలందరి సమక్షంలో పలువురు రైతులకు చెక్కులు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. ఇదే వేదిక నుంచి రెండో విడతగా రాష్ట్రంలో రూ.1.5 లక్షల్లోపు పంట రుణాలున్న రైతులందరి రుణాలను మాఫీ చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. మొత్తం 6.40 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6198 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. రుణవిముక్తి పొందిన లక్షలాది రైతులు తమ ఇండ్లలో పండుగ చేసుకుంటుంటే తమ జన్మ ధన్యమైందని అన్నారు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జులై 18న తొలి విడతగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 11 లక్షల మంది రైతులకు రూ.6098 కోట్లు మాఫీ చేసిందనీ, 12 రోజుల వ్యవధిలోనే రెండో విడతగా మరో రూ.6198 కోట్లు విడుదల చేశామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. పార్టీలకతీతంగా ఈ వేడుకలో పాలుపంచుకున్న నేతలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తామని 2022 మే ఆరో తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లోనే చెప్పిందని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎనిమిది నెలల్లోనే రైతు రుణమాఫీ అమలు చేశామని చెప్పారు.
నెహ్రు, శాస్త్రితోనే హరిత విప్లవం : సీఎం
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రితోనే దేశంలోనే హరిత విప్లవం వచ్చిందని సీఎం చెప్పారు. జైజవాన్, జైకిసాన్ నినాదాలతో దేశ భద్రత, ఆహార భద్రతకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చిందని గుర్తు చేశారు. రైతులకు మేలు చేసేందుకే భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మించిందనీ, పేద రైతులకు తక్కువ వడ్డీలకు రుణాలిచ్చేందుకు ఇందిరమ్మ బ్యాంకుల జాతీయికరణ చేసిందన్నారు. సోనియా గాంధీ నేతత్వంలోని మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తెచ్చిందనీ, రూ.72 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, ఉచిత విద్యుత్, పంటల బీమా, మద్దతు ధరలను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు గత ప్రభుత్వం అప్పుల పాల్జేసి తెలంగాణను తాకట్టు పెట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి, రుణాల భారం తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు తమ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల్లో రూ.43 వేల కోట్లు కిస్తీలు చెల్లించిందని చెప్పారు. రుణవఫీకి నిధులు జమ చేసిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ అధికారుల బందానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అటు రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల లోపు ఉచిత గహ విద్యుత్తు, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నామని అన్నారు.
ప్రజల మేలు కోసమే : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా గాలికి వదిలేసిన పంటల బీమా పథకాన్ని మేము అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రెండు దశల్లో 17.91 అకౌంట్లకు 16.29 లక్షల కుటుంబాలకు 12,289 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఈ సభలో సీఎం ఒక రైతుకు చెక్ అందజేయగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరి ఖాతాలో రుణమాఫీ నిధులు జమ చేశామన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా సీఎం రేవంత్రెడ్డి నాడు, సీఎల్పీ నేతగా నేను మా నాయకుడు రాహుల్గాంధీ హెలికాప్టర్లో వెళ్తూ రూ. 2లక్షల రుణమాఫీ గురించి చర్చించి వరంగల్ డిక్లరేషన్లో ప్రకటిస్తే ఇది సాధ్యమా? అని అంతా ఆశ్చర్యపోయారని చెప్పారు. ధనిక రాష్ట్రంగా అప్పగిస్తేనే రుణమాఫీ చేయలేదనీ, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా అని అందరు అన్నారని చెప్పారు. మాకు సంకల్ప బలం ఉందనీ, ఆ బలాన్ని నిజం చేస్తూ పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు చివరిలోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. కేవలం రుణమాఫీకే పరిమితం కాలేదనీ, రైతు బీమా కింద 42 లక్షల మంది రైతులకు సంబంధించిన 1580 కోట్ల ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దేశ చరిత్రలో, బ్యాంకింగ్ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం బ్యాంకుల్లో జమ కావడం విశేషమన్నారు. బ్యాంకర్లు విశాల హదయంతో రైతులకు సహకరించి వెనువెంటనే రుణాలు ఇవ్వాలనీ, ఇంతటి బహత్కర కార్యక్రమం అమలు చేయడానికి అవకాశం ఇచ్చిన ఏఐసీసీతోపాటు సీఎంకు, సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్గౌడ్, ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి, వెంటక్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, డి శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ్మ, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకులకు కార్పొరేట్ సంస్థలు అప్పులు ఎగవేశాయి : సీఎం
దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని మోసం చేశాయని సీఎం అన్నారు. గడిచిన పదేండ్లలో బ్యాంకులకు దాదాపు రూ. 14 లక్షల కోట్లు ఎగవేశాయని తెలిపారు. పది మందికి అన్నం పెట్టే రైతులు మాత్రం పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆత్మగౌరవం దెబ్బతిని కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతుల కుటుంబాల్లో ఆనందం నింపాలనే రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ.లక్ష రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేక పోయిందనీ, మొదటి సారి అధికారంలో ఉన్నపుడు నాలుగు విడతల్లో మాఫీ చేస్తే, రైతులు తమ అప్పుకు మించి మిత్తీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. రెండో సారి అదే హామీతో అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ఇస్తామని చెప్పి, రూ.12 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. దాదాపు రూ.7 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగవేసిందని గుర్తు చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందోనంటూ కొందరు తమను అవహేళన చేశారనీ, శాపనార్ధాలు పెట్టారని అన్నారు. కానీ తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు నెలలోగా రుణమాఫీకి ప్రణాళిక ప్రకారం నిధులను సమీకరించిందని చెప్పారు. ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.